చిరు ట్వీట్ చూసి పూరీకి చెంపదెబ్బ

పూరి జగన్నాథ్‌కు బ్యాంకాక్‌తో ఉన్న బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఇంట్లోనో.. లేదంటో హైదరాబాద్‌లోని హోటల్లోనో.. లేదా ఇండియాలోని ఇంకేదైనా ప్లేస్‌లోనో కూర్చుంటే పెన్ను కదిలేది కాదు ఒకప్పుడు. కొత్త సినిమా స్క్రిప్టు పని మొదలుపెట్టాలంటే ఆయన బ్యాంకాక్‌ ఫ్లైట్ ఎక్కేసేవాడు. అక్కడికెళ్లి ఏదైనా బీచ్ హౌస్‌లో కూర్చుంటే ఆయనకు ఆలోచనలు తన్నుకొచ్చేసేవి. అక్కడ కూర్చుని వారం పది రోజుల్లో స్క్రిప్టు పూర్తి చేసిన సందర్భాలు బోలెడు అని పూరి చెబుతుంటాడు.

బ్యాంకాక్లో తనకున్న పాపులారిటీనే వేరని.. కార్పొరేటర్ గా నిలబడినా గెలిచేస్తానని పూరి చెప్పాడు ఓ సందర్భంలో. ఐతే బ్యాంకాక్ కు ఇండియన్స్ చాలామంది జల్సా చేయడానికే వెళ్తారు కాబట్టి అక్కడికి పూరి తరచుగా టూర్లు వేయడంలో మరో కోణం గురించి కూడా జనాలకు సందేహాలు వచ్చేవి. ఈ మధ్యే ట్విట్టర్లోకి అడుగుపెట్టిన చిరు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పూరి బ్యాంకాక్ ను మిస్సవుతుంటాడేమో అంటూ కొంటెగా ఒక ట్వీట్ వేశాడు. దీని గురించి పూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించడం విశేషం.

ఆ ట్వీట్ చూశాక తన భార్యకు పాత సంగతులన్నీ గుర్తుకొచ్చాయని.. పర్యవసానంగా తనను ఆమె చెంపదెబ్బ కొట్టిందని ఆయన చెప్పడం విశేషం. పూరి సరదాగానే ఈ మాట అని ఉండొచ్చు కానీ.. ఆయన బ్యాంకాక్ టూర్లు వేయడంపై భార్యతో గొడవలు జరిగాయేమో అనిపిస్తోంది ఈ వ్యాఖ్యలు చూస్తుంటే. ఐతే గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో పూరి బాగా దెబ్బ తినడంతో బ్యాంకాక్ వెళ్లడం మానేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.