జనాలు మర్చిపోతున్నా ఇంకా వదలరేం…?

సినిమా ఐనా.. సిరీస్ ఐనా జనాల్లో ఆధరణ ఉన్న సమయంలో తీసుకు రావాలి.. జనాలు ఆ సినిమా లేదా సిరీస్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఆధరణ లభించే అవకాశం ఉంటుంది. జనాలు ఆ సినిమా గురించి మర్చి పోయిన తర్వాత విడుదల చేస్తే కచ్చితంగా ప్రభావం తగ్గుతుంది అనడంలో సందేహం లేదు.

వెంకటేష్ మరియు రానాలు కలిసి నటించిన రానా నాయుడు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. గత ఏడాది విపరీతమైన బజ్ ఈ వెబ్ సిరీస్ పై క్రియేట్ అయ్యింది. ఫస్ట్ లుక్ విడుదల సమయంలో మరియు వీడియో విడుదల సమయంలో కూడా రానా నాయుడు గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

నెట్ ఫ్లిక్స్ వారు సరైన సమయం కోసం అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వలేదు. చూడబోతుంటే సమ్మర్ వరకు స్ట్రీమింగ్ లేదని తేలిపోయింది. ఇప్పటికే జనాలు రానా నాయుడు గురించి మర్చిపోతున్నారు. కొందరు ఆ మధ్య వచ్చినట్లుగా ఉంది కదా మళ్లీ ఏంటి అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి రానా నాయుడు వెబ్ సిరీస్ క్రేజ్ తగ్గుతుందనే చెప్పాలి. జనాలు మర్చి పోతున్నా ఇంకా స్ట్రీమింగ్ చేకపోవడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. షూటింగ్ ముగిసింది అంటూ చాలా నెలల క్రితమే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ దాదాపుగా ముగిసింది. అయినా కూడా స్ట్రీమింగ్ కు నోచుకోవడం లేదు.

నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్య పెద్దగా వెబ్ సిరీస్ లు కూడా తెలుగు లో రాలేదు. అయినా కూడా దీన్ని దాచి పెట్టడానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. సుపర్న్ వర్మ మరియు కరణ్ అంశుమాన్ లు కలిసి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో వెంకీ చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే వెంకీ తో రానా కాంబో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వెంటనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. స్ట్రీమింగ్ చేయకుంటే అప్పుడప్పుడు సిరీస్ కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ పోస్టర్స్ మరియు వీడియోలను షేర్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.