డ్యూయల్ రోల్ లో నాగచైతన్య?

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ డిఫెరెంట్ జోనర్స్, వైవిధ్యమైన సినిమాలను ట్రై చేస్తూ వస్తున్నారు. ‘దూత’ వెబ్ సిరీస్ సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన చైతూ.. ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే, ఈ మూవీలో చై పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు.. అదే తరహాలో ఇప్పుడు నాగచైతన్య కోసం ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్‌ కథను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో చైతూ డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడు తన కెరీర్ లో ఇప్పటి వరకూ ద్విపాత్రాభినయం చేయలేదు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ‘హలో బ్రదర్’ రీమేక్ కార్యరూపం దాల్చుంటే, చైతన్య డబుల్ రోల్ లో కనిపించేవారు. కానీ అది చర్చల దశలోనే ఆగిపోయింది. ఇన్నాళ్లకు కార్తీక్ దండు సినిమాలో రెండు పాత్రలు పోషించడానికి రెడీ అయినట్లుగా చెప్పుకుంటున్నారు.

థ్రిల్లర్‌ స్టోరీలతో నాగచైతన్య ఎంతగా ప్రభావం చూపిస్తారో విక్రమ్ కె. కుమార్ తో చేసిన ‘దూత’ వెబ్ సిరీస్‌ చాటి చెప్పింది. కార్తీక్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి వస్తున్నారు. దీంట్లో లవ్ స్టోరీ కూడా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అందుకే చైతూకి జోడీగా స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో ‘ఒక లైలా కోసం’ సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

గతంలో నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమాని నిర్మించిన బివిఎస్ఎస్ఎన్ ప్రసాద్.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని.. నవంబర్ లో చై బర్త్ డే నాటికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే వీటన్నింటిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.