తండ్రి కొడుకులతో నటించిన నెరజానలు

తండ్రి.. కొడుకు ఇద్దరితో నటించే అరుదైన అవకాశం కథానాయికలకు దక్కితే …? అది నిజంగానే అరుదైన ఫీట్.. టాలీవుడ్ లో అలాంటి అవకాశాలు దక్కించుకున్న భామలున్నారా?

అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నాఆర్ సరసన కథానాయికగా నటించారు. ఆ తర్వాత అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగార్జున సినిమాలోనూ నాయికగా నటించి ఆశ్చర్యపరిచారు. తండ్రి కొడుకులతో అవకాశం అందుకున్న ఏకైక నాయికగా..శ్రీదేవి పేరు అప్పట్లో మార్మోగింది. ఇలాంటి అవకాశం ఆ తర్వాత పలువురు భామలకు వచ్చింది.

ఈ తరంలోనూ తండ్రి కొడుకులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇటు రామ్ చరణ్ తో అటు మెగాస్టార్ చిరంజీవితోను రొమాన్స్ చేశారు. మగధీర- నాయక్- గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో చరణ్ సరసన నటించిన కాజల్ మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150లో నటించారు. అమ్మడు కుమ్ముడూ అంటూ కాజల్ తో బాస్ రొమాన్స్ ని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కాజల్ కేవలం మెగా కాంపౌండ్ లోనే కాదు.. ఇటు అక్కినేని కాంపౌండ్ లోనూ తండ్రి కొడుకులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. నాగచైతన్య సరసన దడ చిత్రంలో నటించిన కాజల్ నాగార్జున సరసన నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో కుదరలేదు. కానీ తదుపరి కింగ్ నాగార్జున సరసన కాజల్ నటించేందుకు అవకాశం ఉందని తెలిసింది.

మెగా కాంపౌండ్ లో తండ్రి కొడుకులతో నటించిన ఘనత మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కు కూడా దక్కింది. తమన్నా- చరణ్ సరసన రచ్చ చిత్రంలో నటించారు. తర్వాత సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి సరసన నాయికగా కనిపించారు. మెగా బాస్ తో పాటు చరణ్ తోను పోటీపడి డ్యాన్సులు చేయడంలో నటించడంలో తమన్నాకు మంచి మార్కులే పడ్డాయి.

పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అక్కినేని కాంపౌండ్ లో నటించారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్య తో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ ఆ తర్వాత మన్మథుడు2లో నాగార్జున తోనూ రొమాన్స్ చేశారు. అలాగే అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి- నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా.. చైతన్య యుద్ధం శరణం చిత్రాల్లో నటించారు. డాడ్ అండ్ సన్ తో రొమాన్స్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న భామలుగా వీవీపెడియాకెక్కారు.

రెండు జనరేషన్లలో తండ్రి కొడుకులతో నటించే అవకాశం చాలా అరుదుగా కొందరికే దక్కేది. అలాంటి అరుదైన అవకాశం ఇటీవల శృతిహాసన్ కి దక్కింది. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ మూవీలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ లేటెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’లో కూడా హీరోయిన్ గా నటించింది. బాస్ కి ధీటుగా స్టెప్పులేసి మైమరిపించింది శ్రుతి.

కాస్త జనరేషన్ వారీగా పరిశీలిస్తే..

ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించిన సహజనటి జయసుధ బాలకృష్ణతో అధినాయకుడు మూవీలో నటించారు. అక్కినేని సరసన ఆదర్శవంతుడు- గోపాలకృష్ణుడు వంటి చిత్రాల్లో నటించిన రాధ ఆ తర్వాత నాగార్జునతో విక్కీ దాదా లో నటించారు. అమితాబ్ బచ్చన్ కోడలైన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ తో పలు సినిమాల్లో నటించారు. బంటి ఔర్ బబ్లీ చిత్రంలో తండ్రి తనయులతో కలిసి కజురారే పాటలో డ్యాన్స్ లు చేసి ఆకట్టుకున్నారు ఐష్. సూపర్ స్టార్ కృష్ణతో గూడచారి 117 లో నటించిన భానుప్రియ ఆయన వారసుడైన రమేష్ బాబు సరసన ‘బ్లాక్ టైగర్’ అనే చిత్రంలో నాయికగా నటించారు.