తెరపైకి బాలయ్య, రాజశేఖర్ కాంబినేషన్

ఇద్దరూ సీనియర్ నటులే. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాళ్లే. బాలయ్య హీరోగా సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడు. రాజశేఖర్ మాత్రం అదే హీరో ట్యాగ్ ను కంటిన్యూ చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. అందుకే ఇప్పుడు బాలయ్య సహకారంతో రూటు మార్చాలనుకుంటున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బాలయ్య సినిమాలో రాజశేఖర్ కనిపించబోతున్నాడు. అది కూడా ప్రతినాయకుడిగా. అవును.. బాలయ్య సినిమాతో తను విలన్ గా మారబోతున్న విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ప్రకటించాడు. గరుడవెగ ట్రయిలర్ లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజశేఖర్.

జగపతిబాబు లాంటి సీనియర్ హీరో, బాలయ్య సినిమాతోనే విలన్ గా మారాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. అందుకే రాజశేఖర్ కూడా బాలయ్య సినిమాతోనే విలన్ గా మారాలనుకుంటున్నాడు. మరోసారి నటుడిగా బిజీ అవ్వాలనుకుంటున్నాడు.

బాలయ్య హీరోగా, రాజశేఖర్ విలన్ గా ఓ స్టోరీలైన్ రాసుకున్నాడట దర్శకుడు ప్రవీణ్ సత్తారు. సినిమా స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందట. ఈ ప్రాజెక్టుతోనే విలన్ గా ఎంట్రీ ఇస్తాడట రాజశేఖర్. అయితే ఈ సినిమా సాకారం అవుతుందా అనేది అందరి డౌట్. ఎందుకంటే ఇదేదో హడావుడిగా చేసిన ప్రకటనలా కనిపిస్తోంది.