ద‌శాబ్ధం త‌ర్వాత సంచ‌ల‌న బ‌యోపిక్ తో శ్యామ్ బెన‌గ‌ల్!

దిగ్ద‌దర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ నుంచి సినిమా వ‌చ్చి ద‌శాబ్ధం దాటింది. ఆయ‌న చివ‌రిగా 2010 లో `వెల్ డ‌న్ అబ్బ` తెర‌కెక్కించారు. అటుపై ఆయ‌న నుంచి ఎలాంటి సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. తాజాగా శ్యామ్ బెన‌గ‌ల్ సంల‌చ‌న చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుల్ రెహ్మాన్ జీవితం ఆధారంగా `ముజిబ్: దిమేకింగ్ ఆఫ్ ఏ నేష‌న్` టైటిల్ తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అరిఫిన్ షువో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. నుస్ర‌త్ ఇమ్రోజ్ రేణుగా..నుస్ర‌త్ ఫ‌రియా షేక్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజ్ అయిన సినిమా ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. విమానం నుంచి దిగి ముజిబ్ నేల‌ను ముద్దాడే స‌న్నివేశం ఇంట్రెస్టింగ్. మ‌హ్మ‌ద్ అలీ జిన్నా పాత్ర‌ధారి ఊర్దుని రాజ‌భాష‌గా ప్ర‌క‌టించ‌డంతో ఈస్ట్ పాకిస్తాన్ భ‌గ్గుమంటుంది. బెంగాలీ మ‌న మాతృ భాష మాత్ర‌మే కాదు. మ‌న క‌న్న‌త‌ల్లి కూడా అంటూ ముజిబ్ ఉద్వేగంగా ఉప‌న్యాసం ఇవ్వ‌డంతో త‌మ ఉనికి..భాష‌ని కాపాడుకోవ‌డానికి అక్క‌డి జ‌నం పెద్ద ఎత్తున వీధుల్లోకి వ‌స్తారు.

ఆ ఆందోళ‌న‌లు తీవ్ర రూపం దాల్చి యుద్దానికి దారి తీస్తుంది. ఈ స‌మ‌య‌రంలోభార‌త్ ముజిబుర్ రెహ్మాన్ సార‌థ్యంలోని ప‌క్షానికి అండ‌గా నిలిచి త‌న సేన‌ల్ని ఆ భూభాగంలోకి పంపుతుంది. ఈ యుద్దంలో పాకిస్తాన్ తోక‌మువ‌డంతో స్వేచ్ఛా వాయువులు పీల్చిన తూర్పు పాకిస్తాన్ 1971 లో బంగ్లాదేశ్ గా ఆవిర్భ‌విస్తుంది. ఈ ప్ర‌ఖ్యాత చిత్రాన్ని మ‌న దేశానికి చెందిన నేష‌న‌ల్ ఫిల్మ్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్- బంగ్లాదేశ్ ఫిల్మ్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా ఇత‌ర ప‌నులు పూర్తిచేసి అక్టోబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. గ‌తంలో ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని సంక‌ల్ప్ రెడ్డి `ఘాజీ` చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. స‌ముద్ర గ‌ర్భంలో రెండు స‌బ్ మెరైన్ల మ‌ధ్య జ‌రిగే వార్ స‌న్నివేశాలతో భార‌తీయ ప్రేక్ష‌కుల‌కి కొత్త అనుభూతిని అందించారు. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వ‌చ్చిన విష‌యం తెలిసిందే.