నేనేంటో నా స్నేహితుల‌కు తెలుసు! చైత‌న్య‌

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకులతో వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికిన సంగ‌తి తెలిసిందే. దీంతో విడిపోవ డానికి గ‌ల కార‌ణాలు ర‌క‌ర‌కాలుగా నెట్టింట ప్ర‌చారం సాగింది. వాటిలో ఏది వాస్త‌వం? ఏది అవాస్త‌వం అన్న‌ది తెలియ‌దు గానీ ఈ ర‌క‌మైన ప్ర‌చారంతో చైత‌న్య‌-స‌మంత వ్య‌క్తిగ‌తంగా ఎంత బాధ‌ప‌డ్డారో సోష‌ల్ మీడియా వేదిక‌గా రివీల్ చేసిన సంద‌ర్భాలున్నాయి. కొంత‌వ‌ర‌కూ స‌హ‌నం ప‌ట్టిన జోడీ అటుపై క‌ట్టు క‌థ‌నాల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని స్పందించారు.

విడిపోయినా ఎవ‌రి జీవితాల్లో వారు సంతోషంగా ఉన్నామ‌ని… అంత‌కు మంచి విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు అంద‌రికీ చెప్పాల్సిన ప‌నిలేద‌న్న‌ట్లు గా అస‌హ‌నం వ్యక్తం చేసారు. తాజాగా మ‌రో ఇంట‌ర్వ్యూలో నాగ చైత‌న్య త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై వ‌చ్చిన రూమ‌ర్ల‌పై స్పందించారు. నేనేంటో నా స్నేహితుల‌కు తెలుసు. ఓ పాయింట్ త‌ర్వాత నేను దేని గురించి ఆలోచించ‌ను. ప‌ట్టించుకోను. నా వ్య‌క్తిగ‌త జీవితం కంటే న‌టుడిగానే ప్రేక్ష‌కుల‌కు తెలియాల‌నుకుంటా. నేను న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాను.

వాళ్ల మెప్పుకోసం నిరంత‌రం సినిమాలు చేసి అల‌రించాలి. దాని గురించే ఎక్కువ‌గా ఆలోచిస్తాను. అందుకే నా ప‌ని నేను చేసుకుంటూ బిజీగా ఉంటాను. నా సినిమాల ద్వారా ప్రేక్ష‌కులు న‌న్ను ఎప్పుడూ గుర్తు పెట్టు కోవాలి. అందుకు నేను ఏం చేయాలి? ఎలా అయితే ప్రేక్ష‌కులు న‌న్ను యాక్సెప్ట్ చేస్తారు అన్న వాటి గురించే ఆలోచిస్తా.

మిగ‌తా విష‌యాల గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను` అని అన్నారు. విడిపోయిన త‌ర్వాత స‌మంత గురించి చైత‌న్య ఓ పాత ఇంట‌ర్వ్యూలో ఎంతో పాజిటివ్ గా మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. సమంత మంచి మనసున్న వ్యక్తి అని ..ఆమె జీవితంలో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే త‌న జీవితంలో లేని మూడో వ్య‌క్తిని కూడా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి లాగుతున్నార‌ని..ఇలా చేయ‌డం ఆ వ్య‌క్తిని కూడా అగౌర‌వ ప‌రిచిన‌ట్లు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు.