‘పద్మావతి’ సినిమా గురించి మాట్లాడేందుకు మాటల్లేవని తేల్చేసింది ఆ సినిమాలో ‘పద్మావతి’ పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే. ‘ఓ సినిమా చేసినప్పుడే, ఆ సినిమా కోసం ప్రాణం పెట్టాలనుకుంటాం.. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో, ప్రాణాల్ని సైతం లెక్క చేయం.. కానీ, సినిమా రిలీజ్కి ముందు ఈ గందరగోళం.. అత్యంత దారుణమైన విషయం..’ అంటూ వాపోయిందీ బాలీవుడ్ భామ.
‘మాటల్లేవ్..’ అంటూనే, తన ఆవేదనను బయటపెట్టిన దీపికా పడుకొనే, సినిమా రిలీజ్ కాకుండానే అందులో ఏముందో ఊహించేసి, సినిమాపై దుష్ప్రచారం చేయడం, సినిమాని అడ్డుకోవడం ఎంతవరకు సబబు.? అని ప్రశ్నించింది. ‘సినిమాలో వివాదాస్పద అంశాలేమీ లేవని మేం చెబుతున్నాం. సెన్సార్ బోర్డ్ పరిశీలించాకే సినిమా విడుదలవుతుంది. ఈలోగా అభ్యంతరాలెందుకు.?’ అనది దీపిక ప్రశ్న.
‘సినిమా గురించి చాలాసార్లు చెప్పాను. చెబుతూనే వున్నాను. చివరగా ఒక్క మాట. సినిమా విడుదల ఆలస్యమవడం దురదృష్టకరం. ఓ మంచి సినిమాని మిస్ అయ్యామని సినిమా విడుదలయ్యాక అంతా అనుకుంటారు. అంతకు మించి, వివాదాల గురించి మాత్రం మాట్లాడను..’ అని తేల్చేసింది దీపికా పడుకొనే. తన తలకి వెల కట్టడం, థియేటర్లపై దాడులు చేస్తామనడం.. వంటి విషయాలపై స్పందించేందుకు దీపిక నిరాకరించింది.
‘నేనూ భారతీయురాలినే.. నాకూ దేశభక్తి వుంది.. చరిత్రను వక్రీకరించే సినిమాలో నేనెలా నటిస్తాను.?’ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది దీపికా పడుకొనే.