ప్రభాస్ సినిమా.. ఒక్క షాట్‌కు 2 కోట్లు

ఏ ముహూర్తాన ‘బాహుబలి’ సినిమా చేశాడో కానీ.. ఆ దెబ్బతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది. అతడి మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. ‘బాహుబలి’ కంటే ముందు చేసిన సినిమాతో పోలిస్తే తర్వాతి చిత్రానికి పది రెట్ల దాకా మార్కెట్ పెరగడం అనూహ్యమైన విషయం. ఐతే ఇలా మార్కెట్ పెరిగిందని బడ్జెట్లు కూడా అనూహ్యంగా పెంచేస్తున్నారు అతడి నిర్మాతలు.

‘సాహో’ సినిమాకు ఎలా డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారో చూశాం. ఈ సినిమా ప్రతికూల ఫలితం అందుకున్నప్పటికీ.. ప్రభాస్ తర్వాతి సినిమా విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేదని ఈ చిత్ర బృందం నుంచి సంకేతాలు అందుతున్నాయి. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ ఉమ్మడిగా నిర్మిస్తున్న సినిమాకు కూడా ఖర్చు భారీగానే పెడుతున్నట్లున్నారు.

ఈ సినిమా కోసం నిర్మిస్తున్న సెట్స్‌కు ఎలా కోట్లు పోసేస్తన్నారో ఇంతకుముందే వార్తలు వచ్చాయి. తాజాగా ఫారిన్ షెడ్యూల్లో కేవలం ఒక షాట్ కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టిందట చిత్ర బృందం. ఐతే ఒక్క షాటే అయినప్పటికీ సినిమాలో ఇది కీలకమట. 150 మంది కలిసి పది రోజుల పాటు వేసిన మార్కెట్ సెట్లో ఒక ఛేజింగ్ సీన్ తీసిందట చిత్ర బృందం. బాగా ప్రాక్టీస్ చేసి ఒక్క టేక్‌లో ఈ యాక్షన్ ఘట్టాన్ని పూర్తి చేశాడట ప్రభాస్. రెండు మూడు నిమిషాల మధ్య నిడివితో ఈ షాట్ ఉంటుందని.. సినిమాలో ఇది హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఓ డియర్’, ‘జాన్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇండియా, యూరప్ నేపథ్యంగా ఈ కథ నడుస్తుందని సమాచారం. ఈ ఏడాది దసరాకు సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్.