బాలయ్య నిర్మాతపై కబ్జా కథనం

భూములు, కబ్జాలు హైదరాబాద్ కు కొత్త కాదు. ఏనాటి నుంచో భూముల కుంభకోణాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. అయితే ఈ మధ్య కాస్త వార్తలు తగ్గాయి. వున్నట్లుండి ఓ కుంభకోణం వార్త అధికార తెరాస అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ అందించింది.

హీరో బాలయ్యతో ప్రస్తుతం సినిమా చేస్తున్న నిర్మాత సి కళ్యాణ్ ఈ కుంభకోణానికి కేంద్ర బిందువు కావడం విశేషం. ఆ పత్రిక ప్రచురించిన సవివర కథనం చూస్తే ఈ కుంభకోణం చాలా పెద్ద స్కెచ్ తో కూడినట్లు క్లియర్ అవుతోంది. సుమారు 80ఎకరాల భూమి ప్రస్తుతానికి అయితే హక్కు పరంగా, రిజిస్ట్రేషన్ పరంగా సి కళ్యాణ్ పేరిటే వుంది.

కానీ ఇది సరి కాదని, దీని వెనక చాలా మతలబు వుందంటూ, స్టెప్ బై స్టెప్ ను ఆ పత్రిక వివరించింది. అంతే కాదు, ఇప్పటి వరకు దీని మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టలేదని, అంటే ఈ వ్యవహారానికి వాళ్ల మద్దతు కూడా వున్నట్లు అనుకోవాల్సి వస్తోందని రాసుకు వచ్చింది.

సి కళ్యాణ్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో కూడా ఆయన కొన్ని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. మరి ఆయన వెర్షన్ ఏమిటన్నది ఇంకా తెలియదు. రెండు సినిమాలు ఓకేసారి నిర్మిస్తూ ప్రస్తుతం సి కళ్యాణ్ ఫుల్ బిజీగా వున్నారు. వివి వినాయక్ డైరక్షన్ లో సాయి థరమ్ తేజతో, బాలయ్య హీరోగా కేఎస్ రవికుమార్ తో సినిమాలు చేస్తున్నారు. వీటిలో బాలయ్య సినిమా సంక్రాంతికి, రెండో సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతాయి.