మణిరత్నం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. పెళ్లి కుదిరింది!

పదహారేళ్ల కిందట మణిరత్నం రూపొందించిన గొప్ప సినిమా ‘అమృత‌’. ఎల్టీటీ ఈ సమస్యను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ ఒక చిన్నారి కథగా ఈ సినిమాను మలిచాడు మణిరత్నం. బహుశా మణిరత్నం తీసిన ఆఖరి గొప్ప సినిమా అంటే అది అమృత‌ నేనేమో! ఆ తర్వాత పలు సినిమాలు రూపొందించిన మణిరత్నం.. దేన్నీ గుర్తుంచుకోదగిన స్థాయిలో తీయలేకపోయాడు.అమృత‌ సినిమాతో బాగా గుర్తుండిపోయింది కీర్తన. ఆ సినిమాలో శ్రీలంకన్ తమిళ అమ్మాయిగా.. కనిపించిన కీర్తన తన నటనతో కట్టిపడేసింది. మాధవన్, సిమ్రన్ లు ఉన్నా.. మరోవైపు జేడీ, నందితా దాస్ లు ఉన్నా.. ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ మాత్రం ఆ పిల్లే.

ఈ సినిమాకు గానూ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది కీర్తన. 2002లో అమృత‌ వచ్చింది. పదహారేళ్లు గడిచిపోయాయి కదా.. ఇప్పుడు ఆ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్టు పెళ్లికూతురు అవుతోంది. మార్చి ఎనిమిదో తేదీన కీర్తన వివాహం. ఈ అమ్మాయి నేపథ్యం గురించి వేరే వివరించనక్కర్లేదు.ప్రముఖ తమిళనటుడు పార్తిబన్ కూతురే కీర్తన. ప్రముఖ నటి సీత కూతురే ఈ కీర్తన. పార్తిబన్, సీతలు కొన్నేళ్ల కిందట విడిపోయారు. ఇప్పుడు కూతురు పెళ్లి కోసం వాళ్లిద్దరూ కలుస్తున్నారట.

మార్చి ఎనిమిదో తేదీన తన కూతురు వివాహం అని.. ఈ పెళ్లి కోసం భర్తతో కలిసి ఏర్పాట్లలో మునిగిపోయింది సీత. కీర్తన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు.. సీనియర్ ఎడిటర్ ఏ.శ్రీకర్ ప్రసాద్ తనయుడినే ఈమె పెళ్లి చేసుకోబోతోంది. బెస్ట్ ఎడిటర్ గా అనేక సినిమాలకు జాతీయ అవార్డును అందుకున్నారు శ్రీకర్ ప్రసాద్. ఆయన తనయుడు దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నాడు.