మారుతి ‘ త్రీ రోజెస్’

టాలీవుడ్ కింగ్ పిన్స్ లో ఒకరైన అల్లు అరవింద్ స్వంత ఓటిటి ప్లాట్ ఫారమ్ ‘ఆహా’ ను స్టార్ట్ చేసారు. దానికి కంటెంట్ కోసం కాస్త గట్టిగానే పెట్టుబడులు పెడుతున్నారు. స్వంత కంటెంట్ కోసం చాలా మందిని ఎంగేజ్ చేస్తున్నారు.

గీతా సంస్థతో దగ్గర సంబంధాలున్న దర్శకుడు మారుతి కూడా ఓ చేయి వేస్తున్నారు. ఆయన ఓ వెబ్ సీరిస్ ను చేయబోతున్నారు. ఆయన చెప్పిన స్క్రిప్ట్ కు అల్లు అరవింద్ ఓకె చేసారు. ఈ వెబ్ సీరిస్ కు ‘త్రీ రోజెస్’ అని పేరు పెట్టడం విశేషం.

ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు హీరోయిన్లు వుంటారు. హీరోలు అనబడే క్యారెక్టర్లు నాలుగు వుంటాయి. సరదా సరదాగా సాగే పెళ్లిచూపులు వగైరా అంశాలతో ఈ వెబ్ సిరీస్ వంటుంది. ఇప్పడు ఈ వెబ్ సిరీస్ కోసం నటుల వెదుకలాట సాగుతోంది. వెండి తెర మీద కాస్త పేరు తెచ్చుకున్న చిన్న హీరోలు, హీరోయిన్ల కోసం చూస్తున్నారు. అంటే సందీప్ కిషన్, నవదీప్ లాంటి వాళ్లన్నమాట.

స్టార్ కాస్ట్ రెడీ అయితే వెబ్ సిరీస్ తయారీ ప్రారంభమవుతుంది. ఇదిలా వుంటే మరో వెబ్ సిరీస్ ను నిర్మాత రాధా మోహన్ కూడా అందించబోతున్నారు. ఈ స్క్రిప్ట్ ఇంకా ఓకె కావాల్సి వుంది. చూస్తుంటే టాలీవుడ్ మొత్తాన్ని ఆహా దిశగా అరవింద్ నడిపిస్తున్నట్లున్నారు.