రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ సరదాగా అన్న మాటలే నిజం అయ్యాయి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను శ్రీ లీలను తీసుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యం లో గుంటూరు కారం మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల అయ్యింది… మరో హీరోయిన్ పాత్ర లో మీనాక్షి చౌదరి ఎంపిక అయ్యింది… పూజా హెగ్డే సైడ్ అయ్యింది.

త్రివిక్రమ్ వరుసగా అరవింద సమేత మరియు అల వైకుంఠపురంలో సినిమాల్లో పూజా హెగ్డేను నటింపజేశాడు. గుంటూరు కారంలో కూడా ఆమెను అనుకున్నప్పటికి మహేష్ బాబు నో చెప్పడంతో ఆమెను పక్కకు పెట్టాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే గుంటూరు కారం సినిమా కోసం కొత్తగా తీసుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి గతంలో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం మీనాక్షి చౌదరి మొదటి సినిమా ఇచట వాహనాలు నిలుపరాదు విడుదల అయ్యింది.

ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఈవెంట్ కి గాను త్రివిక్రమ్ హాజరు అయ్యాడు. ఆ సందర్భంగా మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుతూ తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుని హీరోయిన్ గా టాప్ పొజీషన్ లో నిలుస్తుంది. అప్పుడు తనకి డేట్లు ఇవ్వాలంటూ త్రివిక్రమ్ కోరాడు.

ఆ సమయంలో త్రివిక్రమ్ సరదాగా అన్నా కూడా ఇప్పుడు అదే నిజం అయ్యింది. గుంటూరు కారం సినిమా కోసం రెండేళ్ల క్రితమే మీనాక్షి చౌదరిని త్రివిక్రమ్ డేట్లు అడిగాడు అంటూ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే.

మీనాక్షి చౌదరి మరియు శ్రీలీల లను తన తదుపరి సినిమాలకు కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. సమంత.. పూజా హెగ్డే అంతకు ముందు ఇలియానా ను తన సినిమాల్లో ఒకటికి మించిన సినిమాల్లో కంటిన్యూ చేసిన విషయం తెల్సిందే. అందుకే ఈ ఇద్దరు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.