లైంగిక వేధింపుని విపులంగా చెప్పిన అమలాపాల్

తనపై లైంగిక వేధింపు జరిగిందంటూ కొన్ని రోజుల కిందట హీరోయిన్ అమలాపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటికే ఆమెపై ఉన్న పన్ను ఎగవేత కేసును పక్కదోవ పట్టించేందుకే అమలాపాల్ ఇలా నకిలీ లైంగిక వేధింపుల కేసును తెరపైకి తీసుకొచ్చిందంటూ కొంతమంది విమర్శలు చేశారు. దీనిపై కాస్త ఘాటుగా స్పందించింది అమలాపాల్. తనపై లైంగిక వేధింపులు ఎలా జరిగాయో చెబుతూ సవివరంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

“జనవరి 31రాత్రి చెన్నైలోని ఓ స్టుడియోలో నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడు. మలేషియాలో ఈవెంట్ అయిపోయిన తర్వాత ఓ ‘స్పెషల్’ డిన్నర్ లో పాల్గొనాలని నాతో చెప్పాడు. అంత స్పెషల్ ఏంటని నేను అడిగాను. చిన్నపిల్లలా మాట్లాడకు. ఆ మాత్రం నీకు తెలీదా అన్నాడు. చుట్టూ చూశాను ఎవరూ లేరు. నా సిబ్బందికి ఫోన్ చేశాను. 30నిమిషాల తర్వాత వాళ్లొచ్చి అతడ్ని పట్టుకున్నారు.”

పక్కాగా నడుస్తున్న ఓ సెక్స్ రాకెట్ లో రింగ్ మాస్టర్ గా అతడ్ని పేర్కొంది అమలాపాల్. అతడి వద్ద తన వ్యక్తిగత ఫోన్ నంబర్ తో పాటు తనకు సంబంధించిన సమస్త సమాచారం అందని తెలిపింది. వెంటనే అతడ్ని టి-నగర్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.అతడి పేరు చెప్పడానికి నిరాకరించిన అమలాపాల్.. కేవలం కొంతమంది మీడియా సభ్యులకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయాన్ని బయటపెట్టానని, ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని ఇంతకుమించి స్పందించలేనని అంటోంది అమలాపాల్.