వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్

తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు దర్శకులు బాలీవుడ్‌లో సత్తా చాటుతుండటంతో, ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్‌లో కొన్ని హిట్ చిత్రాలు తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, తన “వారసుడు” చిత్రం తర్వాత నుంచి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా, ఈసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలే అట్లీ “జవాన్”తో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించగా, సందీప్ రెడ్డి వంగా కూడా “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌లో ఘనవిజయం అందుకున్నాడు. ఈ క్రమంలో తెలుగు దర్శకులకు బాలీవుడ్ హీరోల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. బాలీవుడ్‌లో సౌత్ ఇండియన్ సినిమాల ప్రభావం గణనీయంగా పెరుగుతుండటంతో, వంశీ పైడిపల్లి కూడా బాలీవుడ్‌కి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నాడు.

వంశీ పైడిపల్లి బాలీవుడ్ యంగ్ హీరోలైన రణవీర్ సింగ్ మరియు రణబీర్ కపూర్‌లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తాజా వార్తల ప్రకారం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఇది గనక నిజమైతే, ఈ ప్రాజెక్ట్ వంశీ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలవడం ఖాయం.

అమీర్ ఖాన్ సౌత్ ఇండియన్ దర్శకులపై ప్రత్యేకమైన అభిరుచి చూపిస్తున్నాడు. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన “గజిని” సినిమాతో అమీర్ ఖాన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని కూడా ఆసక్తి చూపుతున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కుదిరితే, అమీర్‌తో కలిసి వంశీ బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లు టాక్. వంశీపైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మున్నా, బృందావనం, ఎవడు, మహర్షి, వారసుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అదే కాంబినేషన్ పనిచేస్తే, ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.

వంశీపైడిపల్లి ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కథ వర్క్‌ను పూర్తి చేశారని, అమీర్‌కు కథ వినిపించడంతో ఆయన ఈ కథపై మంచి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. కథకు గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైన అఫీషియల్ ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాలీవుడ్‌లో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే, ఇది మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.