వారి ‘లవ్‌ స్టోరీ’కి బ్రేక్‌ పడలేదట!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తెగ కంగారు పెట్టేస్తోంది. సినిమా పరిశ్రమపై కరోనా ప్రభావం చాలా క్లీయర్‌గా కనిపిస్తోంది. దాదాపుగా అన్ని భాషల సినిమా పరిశ్రమలు కూడా షట్‌ డౌన్‌ను ప్రకటించాయి. టాలీవుడ్‌లో మాత్రం ఒకటి రెండు సినిమా షూటింగ్స్‌ ఇంకా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందులో ప్రధానంగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్‌ స్టోరీ చిత్రం కూడా ఉందట. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే బ్యాలన్స్‌ ఉన్న కారణంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల వాయిదా వేయకుండా, షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయకుండా కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో షూటింగ్‌ ఆపేస్తే మళ్లీ అందరి డేట్లు కుదరడం అది కూడా రెండు మూడు రోజుల కోసం అంత మందిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పోవడం వల్ల శేఖర్‌ కమ్ముల ప్రమాదం అని తెలిసి కూడా షూటింగ్‌ను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఫిదా వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత దర్శకుడు శేఖర్‌ కమ్ముల చాలా గ్యాప్‌ తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగచైతన్య లుక్‌ మరియు సాయి పల్లవి జోరు ఈ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. షూటింగ్‌ పూర్తి అయితే విడుదల విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ముందు నుండి అనుకున్నట్లయితే ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలి. కాని కరోనా కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు.