వెంకీ కోసం మరో మల్టీస్టారర్ స్క్రిప్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

సినిమాల విషయంలో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతికొద్దిమంది హీరోల లిస్ట్ లో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ కచ్చితంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వచ్చి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. దీంతో ఇప్పుడు సరైన హిట్ కొట్టేందుకు అనిల్ రావిపూడితో జత కట్టారు.

ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌ గా మంచి హిట్స్‌ గా నిలిచాయి. బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఆ రెండు చిత్రాలు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్లుగా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ను రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు.

అయితే వెంకటేష్ ప్రస్తుతం రానా నాయుడు సీజ‌న్ 2 షూటింగ్‌ తో ముంబైలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన లేకుండానే వెంకీ, అనిల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. వచ్చే నెలలో అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌ లో వెంకీ అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వెంకటేష్ కోసం మరో స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విరాటపర్వం ఫేమ్ వేణు ఊడుగుల.. తన మూడో మూవీని వెంకీతో చేసేందుకు సిద్ధమవుతున్నారట.

ఇప్పటికే రెండే సినిమాలు తీసిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విరాటపర్వం మూవీతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేసేందుకు ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో వెంకటేష్ తోపాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా యాక్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

మల్టీస్టారర్‌ గా డైరెక్టర్ వేణు ఊడుగుల స్కిప్ట్ రాసుకుంటున్నారట. ఆ ఇద్దరు యువ హీరోలెవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారని సమాచారం. రానా నాయుడు సీజన్-2ను ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్న వెంకటేష్.. సీజన్-3 కూడా చేయనున్నారని టాక్. అందుకు సంబంధించిన షూటింగ్ ను 2025లో మొదలవ్వనుందట.