సరోగసి వ్యవహారంలో న్యాయ సలహా తీసుకుంటున్న నయన్ దంపతులు..?

లేడీ సూపర్ స్టార్ నయనతార – డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమకు కవల పిల్లలు పుట్టారని చెబుతూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే వారికి ఈ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు.

పెళ్ళైన నాలుగు నెలలకే కవల పిల్లలు పుట్టారంటే.. సరోగసీ ద్వారానే నయన్ దంపతులు తల్లిదండ్రులు అయినట్లు స్పష్టం అయింది. అయితే సరోగసి పద్ధతిలో పిల్లలకు జన్మ నివ్వడం అనేది నిబంధనలకు అననుగుణంగానే జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నయనతార దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

విగ్నేష్ – నయన్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడం చట్ట బద్ధంగా జరిగిందా లేదా? అనే విషయాన్ని విచారించేందుకు తమిళనాడు సర్కారు ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నయనతార – విఘ్నేష్ శివన్ లను విచారణ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో ఏదైనా సమస్య వస్తే దాన్నుంచి బయటపడటానికి సెలబ్రిటీ కపుల్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సరోగసి ద్వారా పిల్లలను పొందడానికి భారతీయ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 2022 జనవరి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అందులో ఉన్న నియమ నిబంధనలను నయనతార దంపతులు అతిక్రమించారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.

కాకపోతే ఈ విషయంపై ఇప్పటికైతే నయన్ – విగ్నేష్ దంపతులపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం సరోగసి విధానం రూల్స్ ప్రకారం జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో అద్దె గర్భాన్ని ఇచ్చిన మహిళ ఎవరనే విషయంపైనా విచారణ జరిపే అవకాశం ఉంది.

సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనడానికి 90 నిబంధనలతో కూడిన ప్రమాణాలతో చట్టాన్ని రూపొందించారని తెలుస్తోంది. ఆ రూల్స్ ప్రకారం సంతానోత్పత్తికి సంబంధించిన కణాలను దానం చేసిన మహిళ వయసు 21 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆమె తప్పనిసరిగా వివాహిత అయి ఉండాలి. సరోగసికి అంగీకరించే ముందు ఆ మహిళ తన భర్త అనుమతి కూడా పొందాలి వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి.

నిబంధనలకు అనుగుణంగానే నయనతార సరోగసి ద్వారా పిల్లలు కన్నారా అనే దానిపై కమిటీ విచారణ చేయనుంది. ఒకవేళ నిబంధనలు అతిక్రమించారని తేలితే పదేళ్ల వరకూ జైలు శిక్ష మరియు రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో నయనతార – విగ్నేష్ దంపతులు ప్రముఖ లాయర్లను సంప్రదించి న్యాయ సలహా తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇందులో భాగంగా సరోగసీ ద్వారా పిల్లల్ని కనిచ్చిన మహిళ ఒక దుబాయ్ సిటిజన్ గా చూపించాలనుకున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో సరోగసీపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. ఏదేమైనా నయనతార దంపతులు తల్లిదండ్రులు అవ్వడమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.