సమంత కోసం లాఠీచార్జ్

అక్కినేని కోడలు సమంతకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో నటించడంతో ఆమెకు కోలీవుడ్ లో కూడా పాపులారిటీ బాగా ఉంది. ఆమెకు అక్కడ ఎంత క్రేజ్ ఉందనే విషయం తాజాగా మరోసారి రుజువైంది.

ఓ జ్యూవెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత.. ఆ సంస్థకు చెందిన బ్రాంచ్ ఓపెనింగ్ కోసం తమిళనాడులోని కృష్ణగిరి వెళ్లింది. ఆమెను చూసేందుకు జనం వేలసంఖ్యలో ఎగబడ్డారు. ఒక దశలో సమంత కారును అభిమానులు చుట్టుముట్టారు.

సమంతను చూసేందుకు ఇంతమంది వస్తారని స్థానిక పోలీసులు కూడా ఊహించలేకపోయారు. దీంతో హుటాహుటిన అదనంగా మరికొంతమంది పోలీసుల్ని రప్పించారు. ఒకదశలో సమంత కారు కూడా కదల్లేదు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కొంతమందికి గాయాలయ్యాయి. మొత్తానికి ఎలాగోలా ఆ జనాల మధ్య నుంచి బయటపడింది సమంత. ప్రస్తుతం ఆ వీడియో వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో బాగా హల్ చల్ చేస్తోంది.