బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షూటింగ్ప్ ప్రారంభించే అంశంలో ఇండస్ట్రీలో ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారితోనే చర్చలు జరిపామన్నారు. అందరినీ పిలవ లేదు.. ఇది నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన విషయం.. అందరినీ పిలిచి మట్లాడాలంటే అందుకు తనకేమీ అభ్యంతరం లేదన్నారు. బాలయ్య విషయంలో అసలేం జరిగిందో తెలుసుకుంటా అన్నారు.

సినిమా షూటింగ్స్ విషయమై మాట్లాడుతూ.. ‘త్వరలోనే షూటింగ్స్ కు అవసరమైన అనుమతులు ఇస్తాం. ఈ పరిస్థితుల్లో ఎలా షూటింగ్ చేయాలి.. ఎంతమంది ఉండాలి.. ఎంత సేపు ఉండాలి అనే అంశాలపై చర్చించి విధి విధానాలు రూపొందించాం. 24 విభాగాల అంశాలపై మాట్లాడాను. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లాక అనుమతి ఇచ్చే అంశాన్ని తెలియజేస్తాం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. ధియేటర్లు తెరిచే అంశంపై ఇంకా చర్చించాల్సి ఉంది’ అని సమావేశ వివరాలు తెలియజేశారు.