రజినీకాంత్‌ కు పవన్‌ కళ్యాణ్‌ శుభాభినందనలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ను ఇవ్వడం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయమై జనసేన పార్టీ అధినేత తెలుగు స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్ కూడా స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేసి మరీ రజినీకాంత్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

పవన్ స్పందిస్తూ.. రజినీకాంత్‌ గారికి దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు దక్కడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆయనకు నా తరపున జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత నాలుగున్నర దశాబ్దాలుగా మెప్పిస్తూ వస్తున్న రజినీకాంత్‌ గారు ఆ అవార్డుకు అన్ని విధాలుగా అర్హులు. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితులు. కొన్నేళ్ల క్రితం అన్నయ్య చిరంజీవి గారితో ఆయన నటించిన సినిమాలు ఇంకా నాకు గుర్తే. రజినీ గారు ఇంకా మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను.