ప్రకాష్ రాజ్ కు బీపీ ట్యాబ్లెట్లు ఇవ్వండి: విష్ణు

‘‘మా ప్యానెల్ సభ్యులు పేపర్ బ్యాలెట్‌కు వెళ్దామన్నారు. పేపర్ బ్యాలెట్ చాలా సార్లు లెక్కించేందుకు అవకాశం ఉంది. ప్రకాశ్‌రాజ్‌కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రీల్ లైఫ్ లొనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ బాగా నటిస్తున్నారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయంటూ మాపై పగ-ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు. ఎన్నికల సంఘం వద్దకు వచ్చి పరిష్కరించుకుంటే అయిపోయేది.

ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉండటంతో మా ప్యానల్ సభ్యుల వినతి మేరకు ఆ విధానం వద్దని ‘మా’కు లేఖ రాశా. గత ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ నే వాడారు. ఇవయితే 200 సార్లయినా లెక్కపెట్టుకోవచ్చు. రేపు మేము గెలిచిన తర్వాత ‘ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు? విష్ణుకు ఆ సత్తా ఉంది. వాళ్లూ వీళ్లూ సాయం చేశారు’ అని పూనకం వచ్చినట్లు ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడతారు కాబట్టే లేఖ రాశా. ప్రకాశ్‌రాజ్‌ కూడా స్వయంగా లెక్కపెట్టుకోవచ్చు. ఆ తర్వాత గెలుపు నాదేనని మీకు తెలుస్తుంది.

‘మా’లో 160 కిపైగా 60 ఏళ్లు పైబడిన వారున్నారు. వారిలో 100 మంది నేరుగా వచ్చి ఓటు వేస్తామన్నారు. వారికి ఫార్మాట్ తెలియకపోతే నేనే పంపించాను. మీకు పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలా? అని అడిగా. ‘నేరుగా వచ్చి ఓటు వేస్తా’మని 100మందికి పైగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, ఇక్కడే నగరంలో ఉన్న పరుచూరి బ్రదర్స్‌ వంటి పెద్దలు ‘పోస్టల్‌ బ్యాలెట్‌కు వెళ్తా’మని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తెలుపుతూ మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని పెద్దలకు సూచించా. ఎలా పంపాలో వాళ్లకు తెలియకపోతే నేనే ఒక లెటర్‌ ఫార్మాట్‌ పంపా. అయితే, ఎవరికి వారే కొరియర్‌ చేసుకున్నారు. ఆ లెటర్లను ఒక వ్యక్తి మాత్రం తీసుకురాలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలంటే రూ.500 కట్టమని ఎన్నికల సంఘం ‘మా’ సభ్యులకు ఎస్‌ఎంఎస్‌ పంపింది. దాంతో పలువురు పెద్దలు నాకు ఫోన్‌ చేసి అడిగారు.

ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమే. అందుకే మీ అందరి తరపున ఆ రూ.500 నేను కడతానని వాళ్లకు చెప్పా.. ఎన్నికల సంఘానికి చెప్తే వాళ్లు ఒప్పుకొన్నారు. న్యాయబద్ధంగా డబ్బు కట్టాం. అయితే.. కొన్ని గంటల తర్వాత ఎన్నికల సంఘం నుంచి ఫోన్‌ వచ్చింది. ‘పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తాం. మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి’ అని చెప్పారు. వాళ్లు చెప్పగానే వచ్చి, డబ్బులు తీసుకున్నాం. అన్నీ లీగల్‌గానే జరిగాయి’’

‘పోస్టల్‌ బ్యాలెట్‌ విషయమై సీనియర్‌ నటుడు శరత్‌బాబుగారితో మాట్లాడానని.. శరత్‌బాబుగారిని తన స్నేహితుడని ప్రకాష్ రాజ్ చెప్పుకొంటున్నారు. ఒకప్పుడు ఆయన మా నాన్న రూమ్మేట్‌. శరత్‌బాబుగారికి ప్రకాశ్‌రాజ్‌ ఫోన్‌ చేస్తే ‘అవును కట్టారయ్యా. వాళ్లకు గూగుల్‌ పే చేస్తా’ అన్నారట. భయపెట్టి ఓట్లు పొందాలని చూస్తే మీరు తప్పకుండా ప్రశ్నించవచ్చు. నోరు ఉంది కదాని పెద్దా-చిన్నా తేడా లేకుండా మాట్లాడొద్దు. ప్రకాశ్‌రాజ్‌ అహంకారి. తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో అడుగు పెట్టనివ్వరు. ఇక్కడకు వచ్చి ఉమ్మడిగా ఉన్న ‘మా’ అసోసియేషన్‌ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’’అని ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

శ్రీకాంత్ గారు.. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్యానెల్‌లో ఉన్న హేమ, బెనర్జీగారు మీరందరూ నాకు ఇష్టమే. 10వ తేదీ తర్వాత మనం మనం ముఖాలు చూసుకోవాలి. 11వ తేదీన ప్రకాశ్‌రాజ్ ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతారు. మీరంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పెద్దలకు మర్యాద ఇవ్వండి. మేమంతా మీ కుటుంబం. మేము ఎవరినీ విమర్శించటం లేదు. ‘మా’ అసోసియేషన్‌ ఒక ఫ్యామిలీ. దయచేసి విడగొట్టకండి’ అని అన్నారు.