నిజానికి ఈ ఉదంతం గురించి విన్న వెంటనే జనాలకు ఇదేం పోయే కాలమన్న భావన కలగటం ఖాయం. ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారికి అవసరమైన సాయాన్ని అందించాల్సింది పోయి.. సెల్ఫీలు దిగుతున్న వైనం చూస్తే.. ఈ ప్రచార యావ ఏందిరా బాబు అన్న ఫీలింగ్ కలగకమానదు.
తాజాగా ఒక ప్రముఖ నటి అనుకోని రీతిలో రోడ్డు యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమెస్వల్పంగా గాయపడ్డారు. ఆమెకు ఆ సందర్భంగా సాయం అందాల్సి ఉన్నప్పటికీ.. అక్కడకు చేరుకున్న వారంతా ఆమెతో సెల్ఫీలు తీసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఇంతకీ ఎవరా ప్రముఖ నటి అంటే.. .బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ నటించిన నేహా దూఫియా. ఆమె చండీగఢ్ నుంచి ముంబయి వస్తున్నారు.
ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో. కిలోమీటరు మేర వాహనాలు ఆగిపోయాయి. ప్రమాదానికి గురైంది ప్రముఖనటి అన్న విషయాన్ని తెలుసుకున్న అక్కడి వారు.. సాయం కోసం రోడ్డు పక్కన గాయాలతో ఉన్న నేహాధూపియాను పట్టించుకోలేదు. కానీ.. ఆమె పక్కకు వెళ్లి ఆమె అనుమతి లేకుండానే ఒకరి తర్వాత ఒకరు సెల్ఫీలు తీసుకోవటం గమనార్హం. ఒకవైపు భుజం నొప్పితో బాధ పడుతుంటే..సెల్ఫీలు మీద సెల్ఫీలు తీసుకుంటున్న వారి వైఖరిని చూసి నేహా షాక్ తిన్నారు. కాసేపటికి మరో కారులో ఆమె ముంబయి వెళ్లిపోయారు. ఈ సెల్ఫీల పిచ్చ జనాలకు ఎప్పటికి పోతుందో?