ఆనందయ్య మందుతో వైసీపీ వ్యాపారం: అచ్చెన్నాయుడు

ఏపీలో ఆనందయ్య మందుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా అధికార పార్టీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడ అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఆనందయ్య మందుతో పేరుతో వైసీపీ దొంగ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. మందుకు అనుమతి రాకముందే అమ్ముకునేందుకు ప్రయత్నించినవారిపై చర్యలేవి అని ప్రశ్నించారు. ఈ కుట్ర బయటపెట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, చోరీ కేసులు పెడతారా అని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం యథేచ్చగా చట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. అవినీతిపరులను ప్రోత్సహించడమే ధ్యేయంగా వైసీపీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసినవారిని వదిలేసి, ప్రజల తరఫున ప్రశ్నించిన సోమిరెడ్డిపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. మందు ప్యాకెట్ ను రూ.160కి అమ్మడానికి చేసిన ప్రయత్నాలు నిజం కాదా అని ప్రశ్నించారు.