ఆస్కార్ తరహాలో జగన్ కు మోసకార్ అవార్డు ఇవ్వాలి: అచ్చెన్నాయుడు

ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ నటనకు ఆస్కార్ అవార్డు తరహాలో మోసకార్ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంశంలో ఆయన నటన ఆస్కార్ అవార్డుకు మించి ఉందని అన్నారు. 5కోట్ల ప్రజల ఆశలను తన కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశారని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా పెయిడ్ ఆర్టిస్టులతో ప్రత్యేకహోదాపై డ్రామాలు ఆడి ఇప్పుడు అధికారంలో ఉండి నోరు మెదపడం లేదని విమర్శించారు.

విభజన సమస్యల పరిష్కారానికి నియమించి ఉప కమిటీ అజెండాలో మొదలు ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి గంటల వ్యవధిలో తొలగించడం వైసీపీ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. కేంద్రానికి తలొగ్గి తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేఖ హోదా వినిపించకుండా చేశారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం జగన్, ఆయన పార్టీలోని ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.