మెట్రో ట్రైన్ లో ‘ఏజెంట్’.. బర్త్ డే ట్రీట్ రెడీ..?

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఏజెంట్”. స్పై క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు.

ప్రస్తుతం ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో జరుగుతోంది. ఓ సాంగ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ని ఇందులో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. మెట్రోలో అఖిల్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అక్కినేని హీరో కర్లీ హెయిర్ కి ఒక బ్యాండ్ పెట్టుకొని ఉన్నాడు.

గతంలో హైదరాబాద్ మెట్రో ట్రయిల్ రన్ లో ఉన్నప్పుడు అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరిపారు. ఇప్పుడు ఏజెంట్ కోసం హ్యాండ్సమ్ హీరో మరోసారి మెట్రో ఎక్కాడని తెలుస్తోంది.

‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. దీని కోసం భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అందరూ షాక్ అయ్యారు. ఈ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ బర్త్ డే ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

‘ఏజెంట్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.

రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిల్ సుంకర – సురేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దర్శక రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. ఇది వరల్డ్ క్లాస్ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

‘ఏజెంట్’ అఖిల్ యాక్షన్ మరియు సురేందర్ స్టైల్ తో ప్రపంచ స్థాయి గూఢచారి సినిమాలతో సమానంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. హిప్ హాఫ్ తమిజ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

‘ఏజెంట్’ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత అఖిల్ చేస్తున్న సినిమా కావడం.. ‘సైరా నరసింహారరెడ్డి’ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించే పాన్ ఇండియా మూవీ అవడంతో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.