అలియా భట్ పై కేసు నమోదు..!

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పై ముంబైలో కేసు నమోదు చేయబోతున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో పాండామిక్ యాక్ట్ కింద ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధం అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ క్యారెంటైన్ లో ఉండాలి. కరోనా వచ్చినా రాకపోయినా కచ్చితంగా 14 రోజులు ఇంటికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.

అయితే అలియా భట్ బీఎంసీ నిబంధనలను అతిక్రమిస్తూ తన కొత్త చిత్రం ‘బ్రహ్మస్త్ర’ మోషన్ పోస్టర్ లాంఛ్ కోసం ఢిల్లీకి వెళ్ళింది. తన బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ తో కలిసి వెళ్లిన ఆమె.. అక్కడ మీడియా సమావేశంలో ఎంతోమందితో ఇంటరాక్ట్ అయింది.

ఢిల్లీలో ఉన్న అలియా భట్ గురించి తెలుసుకోవడానికి బీఎంసీ అధికారులు ఆమె మేనేజర్ ను సంప్రదించారు. నిబంధనలు అతిక్రమించినట్లు తెలిపిన హెల్త్ డిపార్ట్మెంట్.. అలియాని అక్కడే ఉండాలని సూచించింది. కానీ ఈ బ్యూటీ అవేమీ పట్టించుకోకుండా నిన్న రాత్రి ముంబైకి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో పాండామిక్ చట్టం కింద అలియా భట్ పై కేసు నమోదు చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రెడీ అయింది.

దీనిపై బీఎంసీ పబ్లిక్ హెల్త్ కమీటీ ప్రెసిడెంట్ రాజు పటేల్ స్పందిస్తూ.. ‘ఐసోలేషన్ రూల్స్ ని అతిక్రమించినందుకు అలియా భట్ మీద కేసు నమోదు చేసేందుకు డీఎంసీ ఆరోగ్య శాఖకి ఆర్డర్స్ జారీ చేశాను. ఆమె ఒక సెలబ్రిటీగా చాలా మందికి రోల్ మోడల్. అలాంటి వాళ్లు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలు అందరికి సమానమే’ అని అన్నారు.

ఇదిలా ఉండగా గత మూడు రోజుల్లో ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలకి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. కరీనా కపూర్ – మలైకా అరోరా – అమృతా అరోరా – మహిప్ కపూర్ – షానయ కపూర్ వంటి సినీ ప్రముఖులు కరోనా సోకినట్లు ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పోరేషన్ వైరస్ వ్యాప్తి నివారణకు గట్టి చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది.