లీక్ అయిన అల్లు అర్జున్ ‘పుష్ప’ స్టోరీలోని కీ పాయింట్.!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకొని, ఈ సారి పాన్ ఇండియా స్థాయిలోనే రికార్డ్స్ కొల్లగొడుదామని ప్లాన్ చేసిన సినిమా ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్ లో రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇండియా వైడ్ ట్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.. కొత్తదనానికి మారుపేరయిన సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ మూడోసారి అనగానే అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ మాస్ లుక్, ఎర్రచందనం చేసే స్మగ్లర్ గా, కాలికి ఆరు వేళ్ళు ఉండడం లాంటివి చూసాం. ఈ సినిమా చిత్తూరు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ డ్రామా అని అందరికీ తెలిసిందే. సుకుమార్ ప్రతి సినిమాలో కన్నీరు పెట్టించే ఒక ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి సంబందించిన ఓ కీ పాయింట్ బయటకి వచ్చింది.

అదేమిటంటే ‘ చిన్నతనంలోనే అల్లు అర్జున్ తన ఫ్యామిలీ నుంచి విడిపోతాడట, ఆ తర్వాతే స్మగ్లర్ గా మారుతాడట. అలా చాలా డబ్బు సంపాదించాక తన ఫ్యామిలీకి తిరిగి దగ్గరవ్వడంతో ఎమోషనల్ టచ్ మొదలవుతుంది. కానీ అక్కడినుంచే కథ కొత్త మలుపులు తిరుగుతూ సుకుమార్ స్టైల్లో అందరినీ షాక్ కి గురిచేసేలా ట్విస్ట్ లతో కథని ముగిస్తాడట’. అల్లు అర్జున్ అభిమానులకి కావాల్సిన ఊర మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే సుకుమార్ స్టైల్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ పుష్కలంగా ఉండడంతో, పాన్ ఇండియా పరంగా అల్లు అర్జున్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ పక్కా అని టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

మొత్తం 5 భాషల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ పరంగా హిందీలో స్టార్ అయిన సునీల్ శెట్టితో విలన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.