అల్లు అర్జున్‌ అభిమానులపై కేసు నమోదు

అల్లు అర్జున్‌ అభిమానులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. బన్నీ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ తో పాటు పలువురు అభిమానులపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల వారు అంటున్నారు. అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మి గూడటంతో పాటు అనుమతులు లేకుండా బాణా సంచా కాల్చినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. వందలాది మంది అభిమానులు అల్లు అర్జున్‌ ను చూసేందుకు రావడంతో రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

కరోనా నేపథ్యంలో ఎలాంటి గేదరింగ్ లకు అనుమతులు ఇవ్వడం లేదు. ఏదైనా చిన్న కార్యక్రమంను అనుకున్నా కూడా పోలీసుల పర్మీషన్‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాని అల్లు అర్జున్‌ అభిమానులు పోలీసుల అనుమతులు లేకుండానే ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కనుక ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేయడం జరిగింది. గంట సమయం పాటు బాణా సంచా కాల్చడం పట్ల స్థానికులు సైతం న్యూసెన్స్‌ కేసును నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.