అనుష్క ‘నిశ్శబ్దం’ ఓటిటి విడుదలకు గ్రీన్ సిగ్నల్!!

అనుష్క హీరోయిన్‌గా మాధవన్‌ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’. ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నారు.షూటింగ్ పలు కారణాలవల్ల వాయిదా పడుతూ రావడం వలన ఈ ఏడాది ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కావడానికి సిద్ధమైంది. కానీ కరోనా పాండెమిక్ వలన మూవీ విడుదలలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడప్పుడే థియేటర్స్ తెరుచుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

ఇప్పటికే పలుసార్లు నిశ్శబ్దం సినిమాని ఓటిటి లో రిలీజ్ చేస్తారు అనే వార్తలు వచ్చినా ఈ చిత్ర నిర్మాత కోన వెంకట్ మాత్రం ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.. థియేటర్స్ కి అనుమతులు బాగా లేట్ అయితే అప్పుడు ఆలోచిస్తాం అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో 2 లేదా 3 నెలలు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు. దాంతో ఈ చిత్ర టీం ఓటిటి విడుదలకి వెళ్ళడానికే డిసైడ్ అయ్యిందని సమాచారం. బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటిటి కి క్యూ కట్టడంతో నిశ్శబ్దం నిర్మాతలు కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

మరో మూడు నాలుగు రోజుల విజువల్స్ ఎఫెక్ట్స్ పనులు తప్ప మిగతా అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే అవీ పూర్తి చేసి ఫస్ట్ కాపీ తో ఓటిటి డీల్ కి ఆఫర్ ఇస్తారు. ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎక్కువ ఆఫర్ చేస్తే వారికి ఇవ్వడానికే నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట. మరి ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఆగష్టు లో రిలీజ్ అనుకున్న నిశ్శబ్దం సినిమా తెలుగు నుంచి డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ అవుతున్న మొదటి భారీ బడ్జెట్ చిత్రం కానుండడం విశేషం. హేమంత్ మధుకర్ డైరెక్టర్.