ఎట్టకేలకు అనుష్క నిశ్శబ్దం విడుదల తేదీ ఖరారు

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం చిత్రం పలు మార్లు వాయిదా పడి ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవ్వగా కరోనా కారణంగా అది నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నిశ్శబ్దం ఓటిటి రిలీజ్ పై పలు మార్లు రూమర్స్ వచ్చాయి. ఓటిటిలోనే విడుదలవుతుంది అని ఒకసారి, లేదు థియేటర్ లోనే అని మరోసారి ఇలా రూమర్స్ షికార్లు చేసాయి. అయితే ఈ చిత్రానికి సమర్పకుడు అయిన కోన వెంకట్ ఇటీవలే సోషల్ మీడియాలో నిశ్శబ్దం ఓటిటి విడుదల మీకు ఇష్టమేనా అని నెటిజన్స్ ను అడగ్గా ఎక్కువ మంది ఓటిటిలోనే విడుదల చేయమని సలహా ఇచ్చారు.

మొత్తానికి ఓటిటి రిలీజ్ కన్ఫర్మ్ అయినా కూడా రిలీజ్ డేట్ విషయంలో మళ్ళీ బోలెడన్ని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు నిశ్శబ్దం ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నిశ్శబ్దం చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలవుతోన్న ఈ చిత్రం మలయాళంలో మాత్రం డబ్ వెర్షన్ విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.