చిరుతో అమితాబ్ ఓకే.. అతడే డౌటు

మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఉయ్యాలవాడ’ ఎట్టకేలకు ప్రారంభోత్సవం జరుపుకుంది. చిరు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైందిగా భావిస్తున్న ఈ చిత్రానికి ప్రారంభోత్సవం చాలా పెద్ద స్థాయిలో చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చడీచప్పుడు లేకుండా.. మీడియాకు సమాచారం లేకుండా సింపుల్‌గా తమ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో సినిమాను మొదలుపెట్టేశారు.

ఈ సందర్భంగానే చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22న ఉదయం పదిన్నరకు మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రోజు కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజే ఈ సినిమాకు పని చేసే కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడిస్తారట.

ఐతే యూనిట్ వర్గాల నుంచి అందుతున్నసమచారం ప్రకారం ఈ చిత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించారట. అలాగే ‘ఈగ’తో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో నటించబోతుండటం కూడా వాస్తవమే అని సమాచారం. చిరు సరసన ప్రధాన కథానాయికగా నయనతార కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది. ఐతే సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ సంగతే ఫైనలైజ్ కాలేదు. రెహమాన్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే కానీ.. ఆయన ఏ విషయం తేల్చలేదట.

మరి మంగళవారం నాడు సంగీత దర్శకుడిగా ఎవరిని ప్రకటిస్తారో చూడాలి. ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఛాయాగ్రహణం అందించబోతున్నాడు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తాడు. చిరు తనయుడు రామ్ చరణే స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్.. వేమారెడ్డి.. మరో ఇద్దరు రచయితలు కలిసి స్క్రిప్టు తీర్చిదిద్దారు.