లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే వేసుకోండి. గ్రేటర్‌లో మాత్రం మాకే ఓటేయండి: అసద్

హైదరాబాద్‌ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని.. స్థానిక అంశాల్లో బీజేపీ చేసేది కూడా ఏమీ ఉండదని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీపై ఆయన విమర్శలు చేసారు. స్థానిక ఝాన్సీ బజార్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ఇప్పటి వరకూ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న మార్వాడీలు, బెంగాలీ వ్యాపారవర్గాలు మావైపు లేరు.. ఈసారి తమకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

డివిజన్ అభ్యర్ధికై తమకు ఓటు వేయాలని కోరుతూనే.. ఎంపీ ఎన్నికల్లో కావాలంటే బీజేపీకి వేసుకోండి అని అన్నారు. బీజేపీ నేతల హడావిడి.. అగ్ర నాయకుల రాక చూస్తూంటే ట్రంప్ ఒక్కరే బల్దియా ఎన్నికల ప్రచారానికి మిగిలారని అనిపిస్తోంది. బీజేపీ చేసే అభివృద్ధి ఏమీ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న వరద సాయాన్ని కూడా బీజేపీ ఇవ్వనీయకుండా అడ్డుకుంది. తన ఊపిరి ఉన్నంతవరకూ హైదరాబాద్ లో మతసామరస్యం దెబ్బతినకుండా చూసుకుంటానని అన్నారు.

తొంభైల్లో పరిస్థితులు హైదరాబాద్ లో పునరావృతం కానీకుండా చూస్తానని అన్నారు. దత్తాత్రేయ నగర్ డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.