భీమ్లా ట్రైలర్ పై వారి స్పందనేంటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`తో మళ్లీ బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలుపెట్టారు. మూడున్నరేళ్ల పాటు జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా వుంటూ సినిమాలకు దూరంగా వుంటూ వచ్చిన పవన్ `వకీల్ సాబ్`తో మళ్లీ జోరు పెంచారు. ఈ మూవీ తరువాత ఆయన బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. `వకీల్ సాబ్` తరువాత పవన్ మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో `భీమ్లా నాయక్` ముందుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు.

అయితే తెలుగుకు వచ్చేసరికి పవన్ కల్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని భారీ మార్పులు చేశారు. ఆయన పాత్రని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన `భీమ్లా నాయక్` ఇప్పడు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈమూవీ ట్రైలర్ ఈ సోమవారం విడుదల కావడం.. ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ రానా అభిమానుల్ని ఆకట్టుకుంటే .. తాజాగా విడుదలైన థియేట్రికల్ రిలీజ్ ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ ని సెలబ్రేషన్స్ మోడ్ లోకి తీసుకెళ్లింది.

ఇదిలా వుంటే ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ లో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ బిజూ మీనన్ లు `భీమ్లా నాయక్` ట్రైలర్ పై ఏమని స్పందించారు? ఎలా వుందన్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ భీమ్లా ట్రైలర్ పై వారి స్పందనేటీ? అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా స్పందించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీ గురించి ఒరిజినల్ వెర్షన్ లో నటించిన హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్ బిజూ మీనన్ లు ట్రైలర్ ని ఇష్టపడ్డారని అంతే కాకుండా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు. సినిమాకు సంబంధించిన కొన్ని సీన్ లు చూశారని చాలా ఇంప్రెస్ అయ్యారని దర్శకుడు సాగర్ కె. చంద్ర సినిమాని తెరకెక్కించిన విధానం వారిని బాగా ఆకట్టుకుందని స్పష్టం చేశారు త్రివిక్రమ్.

పృథ్వీరాజ్ సుకుమారన్ బిజూ మీనన్ హీరోలుగా నటించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాన్ని సచీ డైరెక్ట్ చేశారు. గౌరీ నందా అన్నా రాజన్ హీరోయిన్ లుగా నటించారు. 2020లో ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ తరువాత దర్శకుడు సచీ గుండెపోటు కారణంగా మృతి చెందడం చిత్ర వర్గాలని శోక సంద్రంలో ముంచింది.