బిగ్ బాస్ 5: సన్నీ, సిరిలలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ సీజన్ 5 లో టికెట్ టు ఫినాలే టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కొంచెం రచ్చ అయింది. ముఖ్యంగా రెండు గ్రూపుల మధ్య గొడవగా ఇది మారుతోంది. అసలు సమస్య అంతా సిరి, సన్నీ టబ్ లో నుండి బాల్స్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడే జరిగింది. ఆమె అనుకోకుండా సన్నీ టబ్ ను పడేయడంతో బాల్స్ అన్నీ కిందపడిపోయాయి. దీంతో సన్నీ ఎప్పటిలానే తనకు అన్యాయం జరిగిందని, తనను టార్గెట్ చేసారని అని అరిచేసి, అందరి దగ్గరికీ వెళ్లి బాల్స్ ను తీయడానికి ప్రయత్నించాడు. అలా అని కాజల్, మానస్ దగ్గరకు వెళ్ళలేదు లెండి, అది వేరే విషయం.

ఇక సిరి మీద కోపం పెట్టుకున్న సన్నీ తన బాల్స్ టబ్ ను డైరెక్ట్ గా కింద పడేసాడు. దాంతో పాటు సిరి వద్దే చాలా సేపు నిలబడిపోయాడు. సన్నీ తన వద్దే ఉండడంతో సిరి ఐస్ లో నుండి కాళ్ళు బయటకు పెట్టలేదు. చివరికి బజర్ మోగి టాస్క్ కంప్లీట్ అయింది. అందరికంటే ఎక్కువ బాల్స్ తో సన్నీ 7 పాయింట్లు సంపాదించుకుంటే శ్రీరామ్ 6 పాయింట్స్ సాధించాడు. అలాగే సిరి 5 పాయింట్స్, మానస్ 4, షణ్ముఖ్, కాజల్ 3, ప్రియాంక 1 పాయింట్ గెలుచుకున్నారు. ఈ టాస్క్ అయ్యాక శ్రీరామ్ చంద్రకు ఐస్ ఎక్కువ సేపు టబ్ లో ఉంచడంతో కాళ్లకు బాగా ఎఫెక్ట్ అయింది. సిరి కూడా మెడికల్ రూమ్ కు వెళ్ళింది.

ఇక సన్నీ అండ్ గ్యాంగ్, షణ్ముఖ్, సిరి గేమ్ ప్లాన్ ను డీకోడ్ చేసుకుంటూ చాలా సేపు గడిపారు. టికెట్ టు ఫినాలే లో సెకండ్ రౌండ్ గా ఫోకస్ ను ఎంచుకున్నారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ఇద్దరు ఇద్దరుగా వచ్చి గార్డెన్ ఏరియాలో చైర్స్ పై కూర్చోవాల్సి ఉంటుంది. అలాగే బజర్ మోగాక వాళ్ళు 29 నిమిషాలను మనసులోనే లెక్కపెట్టుకోవాలి. తమ వద్ద 29 నిమిషాలు అవ్వగానే వాళ్ళు గంట మోగించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్యురేట్ గా 29 నిమిషాలు లెక్క పెడతారో వాళ్లకు 7 పాయింట్స్ వస్తాయి, తర్వాత వారికి 6 పాయింట్స్.. అలా తగ్గుతూ వస్తాయి. అయితే ఇక్కడ సన్నీ గేమ్ ఆడటానికి మానస్ హెల్ప్ తీసుకున్నాడు. సన్నీ లెక్కపెడుతూ ఉంటే బయట నుండి మానస్ కూడా లెక్కపెడుతూ సన్నీకి హెల్ప్ చేసాడు. మరి ఇది రూల్స్ ప్రకారం కరెక్టో కాదో బిగ్ బాస్ చెప్పాల్సి ఉంటుంది.