అమ్మ మరణం… ఆ హీరోయిన్ కు ఎమ్మెల్యే టిక్కెట్?!

జయలలిత  మరణంపై అనుమానాలున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసి సంచలనం సృష్టించిన నటి గౌతమికి మంచి ఛాన్సే దక్కుతున్నట్లు తెలుస్తోంది. జయ మృతి విషయంలో అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆమె ప్రధానికి లేఖ రాయడంతో అప్పట్లో చాలామంది ఈమెకెందుకీ గోల అనుకున్నారు. కానీ.. ఆ రియాక్షనే ఇప్పుడు గౌతమి పొలిటికల్ ఎంట్రీకి ప్లాట్ ఫారం వేసేలా కనిపిస్తోంది. జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానంలో గౌతమిని బరిలో దించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందని తెలుస్తోంది.

ఆర్కే నగర్ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా గురువారం (16వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కపార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ చెబుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్(శశికళ వర్గం), పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక జయ మేనకోడలు దీప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగనున్నారు. పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ ఊగిసలాడుతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అక్కడ విజయావకాశాలను వెతుక్కోవాలనుకుంటోంది.  యూపీలో ఘన విజయం సాధించిన ప్రభావం ఉండొచ్చని ఆశ పడుతోంది. దీంతో.. జయ మృతిపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్లు.. ప్రధానిని కలవడం వంటి చర్యలతో అమ్మ అభిమానులను ఆకట్టుకున్న గౌతమికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట.