చంద్రబాబు కుటుంబానికి చెందిన భూమి కబ్జా యత్నం..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సర్వే నంబర్‌ 222/5లోని 38సెంట్ల భూమిలో రాతి కూసాలు నాటే ప్రయత్నం చేశారు. ఈ భూమి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు పేరున ఉంది. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు 1989లో 87 సెంట్ల రిజిస్టర్ భూమిని కొనుగోలు చేశారు. పంపకాల్లో భాగంగా ఈ భూమిని చంద్రబాబు, రామ్మూర్తి నాయుడులకు పంచారు.

చంద్రబాబు తన వాటాలో కొంత భూమిని ఆస్పత్రి, కల్యాణ మండపానికి వితరణగా ఇచ్చారు. ఇందులోనే రామ్మూర్తి నాయుడుకు చెందిన 38సెంట్ల భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్‌ వేసేందుకు ప్రయత్నించారు. ఈ భూమి నారా రామ్మూర్తి నాయుడు పేరు మీద ఉన్నా ఆన్ లైన్లో నమోదు చేయకపోవడంతో వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. కబ్జా విషయం తెలుసుకుని గ్రామస్థులు అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. నారా కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకోలేదని సమాచారం.