స్పీడు పెంచిన మెగాస్టార్ చిరంజీవి

కరోనా కారణంగా ప్రతీ హీరోకు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెండేళ్లు పట్టింది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం ప్రతీ హీరో వరుసగా మూడు నాలుగు ప్రాజెక్ట్ లు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా స్టార్ ఇటీవల `ఆచార్య` ఫ్లాప్ కావడంతో కొంత నిరుత్సాహానికి లోనయ్యారు.

ఈ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం `వేదాలం` ఆధారంగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ `భోళా శంకర్`. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. దీనితో పాటు బాబి డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` మూవీ చేస్తున్నారు. ఇది కూడా చిత్రీకరణ దశలోనే వుంది. ఇక తమిళ దర్శకుడు మోహన్ రాజాతో ఓ మూవీ చేస్తున్నారు.

మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా `గాడ్ ఫాదర్` మూవీని తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల `ఆచార్య` రిలీజ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నెలరోజుల పాటు షూటింగ్ లకు బ్రేకిచ్చేశారు. ప్రత్యేకంగా వేసవి వేకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు.

తాజాగా తన వెకేషన్ ని ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. మళ్లీ బిజీగా అయిపోయారు. `గాడ్ ఫాదర్` మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని తన పాత్రకు మెగాస్టార్ డబ్బింగ్ చెప్పుకున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని చిత్ర బృందం ప్రారంభించబోతోంది. ఇందులో సత్యదేవ్ కీలక పాత్రలో నటించగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించారు.