విషాదంలో మెగాస్టార్ చిరు.. దానికి కారణమేమిటంటే.?

మెగాస్టార్ చిరంజీవి పర్సనల్ లాస్ కు గురయ్యారు. ఆయన కాలేజీ స్నేహితుడు కుటుంబంతో సహా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చిరంజీవిని తీవ్రంగా కలచివేసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలెంకు చెందిన మైలాబత్తుల సత్యానందం, చిరంజీవి స్నేహితులు. వీరిద్దరూ నర్సాపురంలోని వైఎన్ కళాశాలతో డిగ్రీ కలసి చదువుకున్నారు. విజయకుమారి క్యాన్సర్ తో బాధపడుతున్నారు.

ఆమెకు చికిత్స చేయించే నిమిత్తం జూన్ 26 తెల్లవారుఝామున విజయవాడ నుంచి కారులో భార్య, కుమారుడితో సహా సత్యానందం హైదరాబాద్ బయలుదేరారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశింపేట వద్దకు రాగానే వీరి కారు ముందు వెళ్తున్న ట్యాంకర్ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో కారు ట్యాంకర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. సత్యానందం కుటుంబం మృతి చిరంజీవిని తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని సన్నిహితులు తెలిపారు.

డిగ్రీ తర్వాత చిరంజీవి సినిమాల్లోకి వస్తే.. సత్యానందం రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా స్థిరపడ్డారు. ఇటివల సత్యానందం రిటైర్ అయ్యారు. ప్రశాంత జీవనం సాగిస్తున్న స్నేహితుడు మృతి చిరంజీవిని కలచివేసింది. సత్యానందంకు భార్య, కుమారుడు జోసెఫ్ తోపాటు కుమార్తె ఉన్నారు.