దాసరి-చిరంజీవి కాంబో మిస్ ఫైర్.. ‘లంకేశ్వరుడు’కు 31 ఏళ్లు

‘మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా..’ అని ఓ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్. ఈ డైలాగ్ నే.. ‘ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరో.. నెంబర్ వన్ దర్శకుడు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటదో తెలుసా..’ అని అన్వయించుకోవచ్చు. సరిగ్గా 31 ఏళ్ల క్రితం అదే జరిగింది. ఇండస్ట్రీలో, ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచిన ఆ కాంబినేషనే.. ‘మెగాస్టార్ చిరంజీవి – దర్శకరత్న దాసరి నారాయణరావు’ కలయిక. ఆ సినిమానే ‘లంకేశ్వరుడు’. భారీ అంచనాల మధ్య 1989 అక్టోబర్ 27న విడుదలైందీ సినిమా.

సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా చిరంజీవి ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతున్న సమయం అది. దర్శకుడిగా దర్శకత్వ శైలికే కొత్త అర్ధం చెప్పిన దర్శకుడు దాసరి. వీరద్దరూ కలిసి అప్పటివరకూ సినిమా చేయలేదు. సిస్టర్ సెంటిమెంట్ తో కథ అనుకున్నారు. ఎంత సెంటిమెంట్ ఉన్నా మెగాస్టార్ మార్క్ ఫైట్స్, డ్యాన్స్, మాస్.. ఈ మిక్సింగ్ ఉండనే ఉంది. అనుకున్నట్టుగానే సినిమా తీశారు. ఫస్టాఫ్ బాగుందనే టాక్ వచ్చినా.. సెకండాఫ్ లో ఓవర్ సెంటిమెంట్ తో చిరంజీవి మార్క్ గాడి తప్పి.. పూర్తిగా దాసరి సినిమా వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడిపోయారు.

రాజ్-కోటి ఇచ్చిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘పదహారేళ్ల వయసు..’ పాటలో చిరంజీవి వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ ఊగిపోయారు. వడ్డే రమేశ్ ఈ సినిమాను నిర్మించారు. చిరంజీవి చెల్లి, బావ పాత్రల్లో రేవతి, కల్యాణ్ చక్రవర్తి నటించారు. దీంతో దాసరి–చిరంజీవి కాంబోలో ఈ వన్ మూవీ వండర్.. బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ గా నిలిచిపోయింది.