బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరంజీవి సినిమా!

మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి తర్వాత వరస సినిమాలను సెట్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. వేదాళం రీమేక్ ను మెహెర్ రమేష్ తెరకెక్కించనున్నాడు. ఇక మలయాళ సూపర్ హిట్ లూసిఫెర్ రీమేక్ ను వివి వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రెండూ కాకుండా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి మరో చిత్రాన్ని చేయనున్నాడు.

ఐతే లిస్ట్ దీంతో పూర్తవ్వలేదు. చిరంజీవి మరో సినిమాను ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చిరంజీవి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి అగ్ర నిర్మాత దిల్ రాజు తనతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పై మూడు చిత్రాలు పూర్తయ్యాక తనతో సినిమా చేయడానికి ఒప్పించాడు.

దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరును తెరపైకి తీసుకొచ్చాడు దిల్ రాజు. బోయపాటి మొదటి చిత్రం భద్రను తెరకెక్కించింది దిల్ రాజే. అయితే ఆ తర్వాత నుండి ఇద్దరూ కలిసి పనిచేసింది లేదు. మళ్ళీ దిల్ రాజు బోయపాటితో కాంబోను సెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును చిరంజీవితో చేస్తే ప్రాజెక్ట్ కు మంచి హైప్ వస్తుందని భావిస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.