మెగాస్టార్ తో మాటల మాంత్రికుడు, కానీ!!

మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీలో దూకుడు చూపిస్తున్నాడు. ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే వరస ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే.

మలయాళ చిత్రం లూసిఫెర్ రీమేక్, తమిళ చిత్రం వేదాళం రీమేక్ తో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది చిరంజీవి. ఈ మూడు చిత్రాలను ఏడాది గ్యాప్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చిరంజీవితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఎప్పటినుండో చర్చల దశలో ఉంది. రీసెంట్ గా చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన త్రివిక్రమ్ ఒక లైన్ చెప్పాడట. అది చిరుకు నచ్చడంతో దానిపై వర్క్ చేయమని చెప్పినట్లు సమాచారం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ హీరోగా ఒక చిత్రం చేయాల్సి ఉంది. అది పూర్తైన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తాడని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే చిరుతో సినిమా ఉంటుంది. అంటే మరో రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయి.