‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్ మొదలై చాలా వారాలు కావస్తోంది. చిరంజీవి హోస్ట్ అంటే పడి పడి చూసేస్తారని అనుకున్న నిర్వాహకులని టీఆర్పీలు నిరాశ పరుస్తున్నాయి. ఈ క్విజ్ ప్రోగ్రామ్ కంటే ఎంటర్టైనింగ్ షోలు చాలా వుండడంతో టీవీ ప్రేక్షకులు అటు మొగ్గుతున్నారు.
చిరంజీవి ఎట్రాక్షన్ వుండడం వల్ల ఎప్పుడో బోర్ కొట్టేసిన ఈ కాన్సెప్ట్కి కొత్తగా కళ రాదని తేలిపోయింది. మామూలుగా కంటే ఎక్కువగా సెలబ్రిటీలని పిలిపిస్తూ జనాల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సెలబ్రిటీ ఎపిసోడ్స్ కూడా క్లిక్ అవకపోయే సరికి ఏం చేయాలో చిరంజీవికి, నిర్వాహకులకి పాలుపోవడం లేదు. ఇంకా ఇంకా టీఆర్పీలు కుంటు పడుతూ వుండేసరికి అసలు నెక్స్ట్ సీజన్ చేయాలా అని చిరంజీవి ఆలోచిస్తున్నారట.
మూడు సీజన్ల వరకు కాంట్రాక్ట్ సైన్ చేసినప్పటికీ, షోకి ఆదరణ లేనపుడు కొనసాగించడం అనవసరమని అనుకుంటున్నారట. ఈ సీజన్ పూర్తయ్యేలోగా టీఆర్పీలు పుంజుకోనట్టయితే ఇక ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ని కాల్ ఆఫ్ చేస్తారట. తన బుల్లితెర ఎంట్రీ మెగా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా వున్న చిరంజీవికి ఇది ఇలా ఫ్లాప్ అవడం చాలా ఇబ్బందిగా వుందట.
అయితే షోని ఉన్నపళంగా ఆపేయడం సబబు కాదు కనుక ఏదో రకంగా జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు తన టీమ్తో ప్రత్యేక కసరత్తులు చేయిస్తున్నారట. కానీ ఏం చేసినా మీలో ఎవరు కోటీశ్వరుడుకి మాత్రం పని జరగడం లేదు. మరోవైపు ఈ షో ఫ్లాప్ అవడం మెగాస్టార్ హేటర్స్కి ట్రోల్ చేయడానికి కొత్త ఆప్షన్ ఇచ్చినట్టయింది. దీంతో ఈ షో ఫాన్స్కి కూడా హెడ్డేక్గా తయారైంది.