వ్యాక్సిన్ పంపిణీకి వేళాయే..

కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ పంపిణీకి ఏపీలో ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. టీకా వేసిన తర్వాత ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఈ బృందాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్టు, పల్మనాలజిస్టులతో ఈ బృందం ఉంటుంది. జనవరి మూడో వారం నుంచి టీకా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ మొత్తంగా తొలివిడతలో 5వేల కేంద్రాలను ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రతి కేంద్రంలో రోజుకు దాదాపు వంద మందికి టీకా వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

తొలి విడత టీకాను 30 రోజుల్లో పూర్తిచేయాలని భావిస్తున్నారు. అలాగే టీకాపంపిణీ పై స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలో గ్రామసభలు నిర్వహించి టీకాపై ప్రజల్లో అపోహలు, ఆందోళనలను దూరం చేయనున్నారు. టీకా వేసే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. టీకా పంపిణీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికి టీకా వేయాలి వంటి విషయాలపై వారికి సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.