జర్నలిజం అంటే కల్పితమా.? జర్నలిస్టుకి హరీష్ శంకర్ ప్రశ్నాస్త్రం.!

సినిమా అంటేనే కల్పితం. కల్పిత పాత్రలతో.. అంటూ సినిమాని తెరకెక్కిస్తారు. ఈ విషయం కూడా తెలియని ఓ జర్నలిస్టు ఏకంగా, సెన్సార్ బోర్డు మెంబర్ అయిపోయారు. ఇదీ మన తెలుగు మీడియా ఖర్మ. సి

నీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై తెలుగు మీడియాలో ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న బైక్ ఏకంగా గంటకి 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా సదరు మీడియా ఓ కథనాన్ని తెరపైకి తెచ్చింది. నాన్ స్టాప్ కవరేజ్.. అంటూ పెద్ద రచ్చే చేస్తూ వచ్చింది సదరు మీడియా.

ఈ మొత్తం వ్యవహారంపై సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఒకింత తీవ్రంగానే స్పందించాల్సి వచ్చింది. ‘హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు.. హాస్పిటల్ బెడ్ మీద వుండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్ళకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను..’ అని హరీష్ శంకర్ ట్వీటేశారు.


దాంతో, ఓ జర్నలిస్టు ‘భుజాలు తడిమేసుకున్నాడు’. ‘మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ, తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్ళి మీరు ప్రమాదానికి గురవడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు’ అని సదరు జర్నలిస్టు ట్వీటేశాడు.

‘నేను తప్పుడు వార్తలు అని క్లియర్గా మెన్షన్ చేశాను కదా. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు.. అంటే ఒప్పుకున్నట్లేనా.? థాంక్యూ ఫర్ యువర్ క్లారిటీ.. ఇక పోతే, మా సినిమాల్లో హింస అన్నారు. మాకు సెన్సార్ వుంది. మేం వాళ్ళకు ఆన్సరబుల్. మీకేముంది.. మీరు దేనికి ఆన్సరబుల్ కాస్త చెబుతారా? నేను మీ వ్యవస్థని తప్పు పట్టలేదు. వ్యవస్థని తప్పుదోవ పట్టించేవాళ్ళ గురించి చెబుతున్నాను..’ అని హరీష్ శంకర్, సదరు జర్నలిస్టుని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.


దానికి అట్నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, ‘వ్యక్తిగా సమాజానికి జవాబుదారున్ని, జర్నలిస్టుగా ప్రశ్నించే గొంతుని. ఇక సెన్సార్ అంటారా.. అది ఎలా చేస్తారో మెంబర్‌గా నాకు తెలుసు..’ అంటూ సెన్సార్ బోర్డు మెంబర్‌గా తన పేరున్న ఓ సెన్సార్ సర్టిఫికెట్‌ని జత చేశాడు ఆ జర్నలిస్ట్.

హరీష్ శంకర్ ఫైనల్ టచ్ బీభత్సమైన రేంజ్‌లో ఇ్చేశాడు. ‘మరి సెన్సార్ బోర్డు మెంబర్ అంటున్నారు కదా.. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం.. నిజం కాదు అని మేం వేస్తాం. మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు మా ఛానల్ కల్పితం అని వేయండి మరి.. జనాలకి ఒక క్లారిటీ వుంటుంది. లేదంటే, వార్తలతో సినిమాల్ని పోల్చడం మానెయ్యండి..’ అని ట్వీటేశారు హరీష్ శంకర్.


ఈ స్థాయికి జర్నలిజం దిగజారిపోయిందని ఓ జర్నలిస్ట్ ఒప్పుకున్నట్లయ్యింది. హరీష్ శంకర్ అన్నాడని కాదుగానీ, నిజంగానే జర్నలిజం అంటే కల్పితం అయిపోయింది.. అదీ మెరుగైన సమాజం కోసమంటూ బురద జర్నలిజం చేసే ఓ ఛానల్ మరికొన్ని ఛానళ్ళ పుణ్యమే.