రైజింగ్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ చేసేసుకుంది

హీరోయిన్లు ప్రేమలో పడటం.. ఎఫైర్లు నడపడం మామూలే. కానీ ఆ బంధాలు ఎంత కాలం ఉంటాయన్నదే సందేహం. సుదీర్ఘ కెరీర్ ముందున్నపుడు ముందే కమిటైపోవడం.. ఎంగేజ్ కావడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. కెరీర్‌కు ఇబ్బంది వస్తుందని భావించి సీరియస్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడానికి హీరోయిన్లు ఇష్టపడరు.

ఇక పెళ్లికి కమిట్మెంట్ ఇవ్వడమంటే మరీ కష్టం. కానీ మాంచి రైజింగ్‌లో ఉన్న కన్నడ భామ రష్మిక మండన్నా మాత్రం పెద్ద సాహసమే చేసింది. తన తొలి చిత్ర దర్శకుడు రక్షిత్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్యే మీడియాలో వార్తలొచ్చాయి. తాము పెళ్లి చేసుకునే అవకాశాలున్నట్లుగా కూడా రష్మిక సంకేతాలిచ్చింది.

కానీ రక్షిత్ దర్శకత్వంలో రష్మిక నటించిన ‘కిరిక్ పార్టీ’ సెన్సేషనల్ హిట్టయి.. కన్నడతో పాటు పొరుగు భాషల్లోనూ ఆమెకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. నాగశౌర్యతో ఆల్రెడీ తెలుగులో ఓ సినిమా చేస్తున్న రష్మిక కోసం స్టార్ హీరోల కళ్లు కూడా పడ్డట్లు చెబుతున్నారు. ఆమెకు హీరోయిన్‌గా లాంగ్ కెరీర్ ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి టైంలో అప్పుడే పెళ్లికి కమిట్మెంట్ ఇచ్చేస్తే అది కెరీర్‌కు కచ్చితంగా ఇబ్బందే.

కానీ రష్మిక మాత్రం కెరీర్ కంటే వ్యక్తిగత జీవితమే ముఖ్యం అనుకున్నట్లుంది. బెంగళూరులో సన్నిహితుల సమక్షంలో రక్షిత్‌తో ఆమె ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. మామూలుగా ఇలా పెళ్లికి కమిటైపోయిన.. పెళ్లి చేసుకున్న హీరోయిన్లతో ఇబ్బందులుంటాయని భావించి.. వాళ్లకు అవకాశాలు ఇవ్వరు నిర్మాతలు. మరి రష్మిక పరిస్థితి ఏమవుతుందో చూడాలి.