సినిమా టికెట్స్ ఇష్యూ… రైల్ టికెట్స్ తో పోల్చుతూ హీరో కామెంట్స్

కరోనా థర్డ్ వేవ్ అంటూ ఒక వైపు ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్ భయపెడుతున్నా కూడా సంక్రాంతికి భారీ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ప్రకృతి కోపంగా ఉన్నా కూడా ధైర్యం చేసి సినిమాలను విడుదల చేయాలనుకుంటున్న మేకర్స్ కు ప్రభుత్వాల నుండి కూడా సహకారం అందడం లేదు అనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా అసంతృప్తితో ఉన్నారు అనిపిస్తుంది. కొందరు బాహాటంగా అంటూ ఉంటే మరి కొందరు మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొందరు మాత్రం ఇండైరెక్ట్ గా టికెట్ల రేట్ల విషయంలో అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి సినిమా టికెట్ల రేట్లను పెంచాల్సిందే అన్నట్లుగా ఏపీ ప్రభుత్వంను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

ఇటీవల నాని మాట్లాడుతూ.. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం ప్రేక్షకులను అవమానిస్తుంది అన్నాడు. కిరాణ షాపు గల్లా పెట్టెకు వచ్చినంత కూడా థియేటర్ కు రానప్పుడు ఎలా థియేటర్ లను నడుపుతారు అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఆ వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం రేపడం జరిగింది. ఇప్పుడు మళ్లీ యంగ్ హీరో నిఖిల్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియాలో చర్చ మొదలు అయ్యింది. నిఖిల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సినిమా అనేది రైలు ప్రయాణం వంటిది. సినిమా థియేటర్ లో 20 రూపాయల టికెట్ ఇప్పటికి ఉంది. కనుక ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. రైలు లో కనుక జనాలు ఎవరి స్థాయిని బట్టి వారు టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించినట్లుగా సినిమా టికెట్ల విషయంలో కూడా అదే జరుగుతుందని.. అలాగే అందరికి అందుబాటులో ఉన్నాయి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను మరీ తక్కువ చేయక పోయినా కూడా టికెట్ల రేట్లు అందరికి కూడా అందుబాటులోనే ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నాకు సినిమా థియేటర్ దేవాలయం వంటిది అన్నాడు. సినిమా లు థియేటర్లలో చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపించినట్లుగా నేను థియేటర్లలో సినిమాలను చూడాలని కోరుకుంటాను. సినిమా లు థియేటర్లలో ఆడేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశాడు. మెల్ల మెల్లగా యంగ్ హీరోలు స్టార్ హీరోలు వరుసగా టికెట్ల రేట్ల విషయంలో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందా అనేది చూడాలి.