నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా చాలామంది ఈ కాంబినేషన్ మీద సందేహాలు తొలగిపోలేదు. బాలయ్య కానీ.. నిర్మాత కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించని నేపథ్యంలో అసలీ చిత్రం ఉంటుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఓ వర్గం మీడియాలో ఈ సినిమా క్యాన్సిల్ అన్న రూమర్లు కూడా మొదలైపోయాయి.
ఐతే ఈ రూమర్లన్నింటికీ తెరపడే రోజు వచ్చేసింది. గురువారమే బాలయ్య-పూరి సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇందుకోసం సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న బాలయ్య కోసం నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ భారీ స్వాగత ఏర్పాట్లే చేసింది. తెలుగు చరిత్రకు తిలకం దిద్దిన మా హీరో నందమూరి బాలకృష్ణకు స్వాగతం అంటూ భారీ కటౌట్ ఏర్పాటు చేసింది.
గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది. బాలయ్య.. పూరి.. భవ్య ఆనంద్ ప్రసాద్.. ముగ్గురూ ఒకరితో ఒకరు పని చేయబోతుండటం ఇదే తొలిసారి. బాలయ్య-పూరి కాంబో అన్నది అసలు ఊహకందని విషయం. అందుకే ఈ ప్రాజెక్టుపై జనాల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ చిత్రం కోసం పూరి కాస్టింగ్ కాల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి సెప్టెంబరు 29న రిలీజ్ చేయాలన్నది పూరి ప్లాన్.