జగదేకవీరుడు సీక్వెల్.. అసలు జరిగే పనేనా?

అశ్వినీదత్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ తీయడం తన కల అని, అది తీశాకే రిటైర్ అవుతానని చెప్పుకొచ్చాడు. నిజానికి అశ్వినిదత్ ఈ రకమైన ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఈ సినిమా గురించి కలలు కంటున్నాడు. చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలై అప్పుడే 30 ఏళ్ళు గడిచిపోయిందా అనిపిస్తోంది. ఒక టైం లెస్ క్లాసిక్ గా ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే ఇప్పుడు ఇలాంటి క్లాసిక్ కు సీక్వెల్ తీయడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే సెంటిమెంట్ పరంగా టాలీవుడ్ కు సీక్వెల్స్ అచ్చి వచ్చిన చరిత్ర లేదు. బాహుబలి 2 తప్పితే మన దగ్గర సీక్వెల్స్ పెద్దగా ఆడలేదు. అందులోనూ ఒక క్లాసిక్ ను టచ్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను అప్పట్లో రాఘవేంద్ర రావు హ్యాండిల్ చేసినట్లే ఇప్పుడు దాన్ని రాజమౌళి ఒక్కడే హ్యాండిల్ చేయగలడేమో అంటున్నారు. అయితే రాజమౌళికి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల పరంగా చూసుకుంటే సాధ్యం కాకపోవచ్చు.

అశ్వినీదత్ ఈ సినిమాకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ అయితే బాగుంటుందని గతంలో ప్రకటించాడు. మరి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తెరకెక్కడం అంత సులభం కాదన్నది వాస్తవం.