నిత్యం సవాళ్ల మీద సవాళ్లు విసురుతుంటారు జగన్. వైరి వర్గంపై అదే పనిగా విరుచుకుపడే ఆయన కీలక విషయాల మీద తన వైఖరిని స్పష్టంగా చెప్పరు. ప్రజలకు అవసరమైన ఏ విషయం మీదా తానేం చెప్పదలుచుకున్నారో చెప్పని తత్వ్తం మొదటి నుంచి ఆయనకు ఉన్నదే.
ఓపక్క రాష్ట్రం రెండు ముక్కలు అవుతున్న వేళ కూడా.. చెప్పి చెప్పనట్లుగా విభజన మీద తన మాటను చెప్పారే తప్పించి.. ఆయన చేసిందేమీ లేదని చెప్పాలి. పీకల్లోతు కేసుల్లో చిక్కుకుపోయి తన నోటి నుంచి వచ్చే మాటలకు మరిన్ని చిక్కుల్లో పడే ప్రమాదం ఉందన్న ఏ విషయం మీదా ఆయన పెద్దగా పెదవి విప్పకపోవటం కనిపిస్తుంది.
విభజన మొదలు.. కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో హ్యాండ్ ఇచ్చిన వైనం మీదా ఆయన పెద్దగా స్పందించరు. అలా అని మౌనంగా కూడా ఉండరు.
ఏదో చేస్తున్నట్లుగా అందరిని భ్రమలో పెట్టేసేలా వ్యవహరించటం జగన్కు అలవాటు. ప్రత్యేక హోదా మీద జగన్ ఏం చేశారన్న మాట ఎవరి నోట వచ్చినా.. పెద్ద లిస్ట్ చదివేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధంగా ఉంటారు. ఈ జాబితా సంగతి తర్వాత.. సింపుల్ గా సూటిగా.. హోదా ఇవ్వని కేంద్రాన్ని.. దానికి నాయకత్వం వహిస్తున్న మోడీని ఎందుకు విమర్శించరు.. మరెందుకు తప్పు పట్టరు? అన్న ప్రశ్నను సంధిస్తే నోట మాట రాని పరిస్థితి.
హోదా మీద ఏదో చేస్తున్నట్లుగా ప్రజలకు అనిపించేలా కొన్ని కార్యక్రమాల్ని నామమాత్రంగా నిర్వహించటం మినహా.. కేంద్రానికి షాకిచ్చేలా.. తలబొప్పి కట్టేలా చేయటం జగన్ లో అస్సలు కనిపించదు. తాను సీఎం కావాలనుకున్న ప్రాంతానికి.. అక్కడుండే ప్రజల గురించి.. వారి భవిష్యత్తు గురించిన విజన్ జగన్ లో అస్సలు కనిపించదు.
హోదా ఇవ్వని పక్షంలో తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు తప్పించి ఇంకేమీ ఉండదు. జగన్ చెప్పిన టైం వచ్చేసినా..ఎంపీల రాజీనామా మీద ఆయన అస్సలు మాట్లాడటం లేదు.
మాట ఇస్తే మడమ తిప్పని ఫ్యామిలీ అని గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి.. హోదా విషయంలో ఆయనెన్ని పిల్లి మొగ్గలు వేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యన ఎమ్మెల్యేల రాజీనామా గురించి డిమాండ్ చేస్తున్న జగన్.. తాను చెప్పిన ఎంపీల రాజీనామా గురించి ఎందుకు ప్రస్తావించరన్న ప్రశ్నకు జగన్ తో సహా ఎవరూ సమాధానం చెప్పటం లేదు.
ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల విషయంలోనూ జగన్ తీరు విచిత్రంగా ఉంటుంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను తనవైపు తిప్పుకోవటంలో విజయవంతమైన ఆయన.. కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడరు. ఆర్య వైశ్యులకు ఫెడరేషన్ ఇస్తానన్న మామీ ఇచ్చేసిన కాపు.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు రిజర్వేషన్లు ఇస్తానన్న మాట ఎందుకు చెప్పరన్నది అర్థం కానిది. నిద్ర లేచింది మొదలు చంద్రబాబు అది చేయలేదు.. ఇది చేయలేదన్న మాట అనేసే జగన్.. కాపుల్ని బీసీల్లో చేర్చే అంశంపై తన వైఖరిని ఎందుకు స్పష్టం చేయరన్నది పెద్ద ప్రశ్న. వరాల మీద వరాలు ఇచ్చే జగన్.. కాపుల్ని బీసీల్లో చేరుస్తాననే మాటను విస్పష్టంగా ఎందుకు చెప్పరన్న దానిపై ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఆ విషయాన్ని ప్రజలు నిలదీయాల్సిందే. అప్పుడే విపక్ష నేతలోని ద్వంద వైఖరి బయటపడుతుంది.